Transco | ధర్మారం, జూన్ 15 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఓ లైన్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంతో దినసరి ఎలక్ట్రికల్ వర్కర్ కట్ట అశోక్ (30) విద్యుత్తు సరఫరా జరిగి మంటల్లో కాలి తీవ్ర గాయాల పాలయ్యాడు. దాదాపు 80 శాతం అతడికి మంటలతో గాయాలు కాగా మొదట చికిత్స కోసం కరీంనగర్ తరలించగా అక్కడ పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇటీవల గాలివానతో ఆ గ్రామంలోని బైపాస్ రోడ్డులో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో అట్టి స్తంభాల మరమ్మతులు, విద్యుత్ తీగలు సరి చేసే పనులను ఆ శాఖ సిబ్బంది పిలుపుమేరకు అదే గ్రామానికి చెందిన అశోక్ దినసరి ఎలక్ట్రికల్ వర్కర్ గా గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో బైపాస్ రోడ్డులో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు పనులు చేయడానికి అశోక్ సోమవారం వెళ్లాడు. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ఆనంద రావు ధర్మారం సబ్ స్టేషన్ నుంచి ధర్మారం ఫీడర్ కు లైన్ క్లియరెన్స్ ( ఎల్ సి) తీసుకోకుండానే అశోకు ను ట్రాన్స్ ఫార్మర్ ను ఎక్కించాడు. దీంతో అశోక్ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే అప్పటికే విద్యుత్ సరఫరా ఉండడంతో షాక్ తగిలి దానిపైనే పడిపోయాడు. ఈ సంఘటన ఎల్ ఐ కళ్లెదుటే జరిగింది. దీంతో మంటలు చెలరేగి సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మంటల్లో కాలుతున్న విషయాన్ని అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగు చూడగా అది వైరల్ అయింది. షాక్ తగిలిన తర్వాత కరెంటు నిలిచిపోవడంతో బాదితుడిని ట్రాన్స్ ఫార్మర్ నుంచి కిందికి దించగా కాలిన గాయాలతో విలవిలలాడాడు. దీంతో గ్రామస్తులు అతనిని మొదట చికిత్స కోసం కరీంనగర్ లోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అశోక్ కు 80శాతం గాయాలైనట్లు ధృవీకరించినట్లు అతని వెంట ఉన్న స్థానిక సర్పంచ్ మేడారం వీర్ పాల్ తెలిపారు.
కాగా అతడి పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు క్షతగాత్రుడు అశోకు ను తరలిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సంఘటనపై ధర్మారం ఇన్చార్జీ ట్రాన్స్ కో ఇంజనీర్ ప్రణయ్ ను వివరణ కోరగా ధర్మారం సబ్ స్టేషన్ నుంచి నంది మేడారం వెళ్లే ఫీడర్ నుంచి ఎలాంటి ఎల్సీ తీసుకోలేదని వెల్లడించారు.
ఎన్పీడీసీఎల్ అధికారులపై పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకుల ఫిర్యాదు
నంది మేడారం గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి అశోక్ గాయపడిన సంఘటనపై బొట్ల వనపర్తి బీజేపీ నాయకులు కొక్కుల బాలకృష్ణ, కర్రే లక్ష్మణ్, మాణిక్యం తదితరులు ధర్మారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.