కొత్తపల్లి, డిసెంబర్ 10: మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి అభివృద్ధికి సహకరించాలని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
కొత్తపల్లి మండలం జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నందున శివారు భూములకు డిమాండ్ వచ్చిందని, మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించాలని అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు, ఎంపీటీసీలు సమావేశం దృష్టికి తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పిట్టల కరుణ-రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు భూక్యా తిరుపతినాయక్, దావ కమల మనోహర్, పట్టెం శారద-లక్ష్మీనారాయణ, పండుగ గంగవ్వ-నర్సయ్య, కొమ్ము హేమలత-రవి, రవికిరణ్, మంద రమేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు షరీఫ్, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ రమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.