జ్యోతినగర్, ఏప్రిల్ 7 : కార్యకర్తలు కష్టపడి పనిచేసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. ఎన్టీపీసీలోని ఎస్ఎస్ గార్డెన్స్లో ఆదివారం బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల పార్టీ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రచార విధివిధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోని తప్పిదాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎండగట్టాలన్నారు. వంద రోజుల పాలనలో 209 మంది రైతులు మరణించారని, కానీ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఒక్క రైతు కూడా చనిపోలేదని దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ సర్కారుకు ఓట్లడిగే హక్కులేదని విమర్శించారు. ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే మన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు.
తెలంగాణ ఉన్నంతకాలం గులాబీ జెండా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజాసమస్యలపై ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన తాను.. 30 ఏండ్లుగా ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తున్నానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, దావ వసంత, జక్కు శ్రీహర్శిణి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహార్రెడ్డి, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్రావు పాల్గొన్నారు.