అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కోడి గుడ్ల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వాటిపై ప్రత్యేకంగా ముద్ర వేస్తున్నది. తద్వారా అర్హులకే పౌష్టికాహారం అందనుండడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరనున్నది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారంలో ముఖ్యమైనది కోడిగుడ్డు. అవి చాలా ప్రాంతాల్లో లబ్ధిదారులకు చేరుతున్నా.. ఎక్కడోచోట అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా కోడిగుడ్లు అందాలనే ఉద్దేశంతో జోన్ల వారీగా వాటిపై ముద్రలు వేసి మూడు రంగుల్లో విడుతల వారీగా అంగన్వాడీలకు సరఫరా చేయించి, లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఈ విడుత నుంచే ఈ కొత్త విధానంలో పంపిణీ ప్రారంభించారు.
54,218 మంది లబ్ధిదారులు
జిల్లాలో 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో బాలింతల నుంచి చిన్నారుల వరకు 54,218 మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో గర్భిణులు 4645 మంది, బాలింతలు 3257 మంది, ఆరునెలల్లోపు చిన్నారులు 2842 మంది, ఆరునెలల నుంచి మూడేండ్లలోపు చిన్నారులు 23031 మంది, మూడు నుంచి ఆరేండ్లలోపు చిన్నారులు 20443 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలతో పాటు మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులకు రోజుకొకటి చొప్పున రెండు విడుతల్లో గుడ్లను అందజేస్తున్నారు. అలాగే ఆరు నెలల నుంచి 3సంవత్సరాల చిన్నారులకు నెలకు 16గుడ్లు రెండు విడుతల్లో పంపిణీ చేస్తున్నారు.
ఏడు జోన్లు..
ప్రభుత్వం కోడిగుడ్లను పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7జోన్లుగా విభజించి అందిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాను జోన్ 3గా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ గుడ్లపై ‘జోన్-3 తెలంగాణ ప్రభుత్వం’ అని రౌండ్ సీల్ మాదిరి ముద్రిస్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలంలో ఈ ముద్రలను నీలం రంగు, ఆకుపచ్చరంగు, ఎరుపు రంగుల్లో మూడు విడుతల్లో అందజేస్తుండగా.. ఎండాకాలం తర్వాత నీలం, ఎరుపు రంగుల్లో అంగన్వాడీలకు సరాఫరా చేయనున్నారు. మొదట సరఫరా చేసిన రంగు గుడ్లు పూర్తిగా అయిపోయాకే మరో విడుత అందజేయనున్నారు. ఇలా పకడ్బందీగా సరఫరా చేయడంతో ఎప్పటి గుడ్లు అప్పుడే పంపిణీ జరుగడంతో పాటు ఎక్కడా కూడా పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది.
పౌష్టికాహారం సద్వినియోగం చేసుకోవాలి
అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నది. దీనిని ప్రతి విడుతలో తప్పనిసరిగా లబ్ధిదారులు తీసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. చిన్నారుల్లో భవిష్యత్తులో పౌష్టికాహార లోపం నివారించుకోవాలి. ఈ మేరకు గ్రామాల్లో నిత్యం పర్యవేక్షిస్తూ..బాలింతలు, తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం.
-శ్రీలత, సూపర్వైజర్, ఐసీడీఎస్
పారదర్శకత పెరుగుతుంది
కోడిగుడ్లపై ముద్రలు వేసి, మూడు దశల వారీగా బ్లూ, గ్రీన్, రెడ్ రంగుల్లో సరఫరా చేయడం వల్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతుంది. లబ్ధిదారులకు తప్పకుండా చేరాలనే ప్రభుత్వ ఉద్దేశం ఇలాంటి చర్యల వల్ల నెరవేరుతుంది. పౌష్టికాహారం పంపిణీని నిత్యం పర్యవేక్షిస్తున్నాం.
-సబిత, సీడీపీవో, కరీంనగర్ రూరల్