పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
పెద్దపల్లి జంక్షన్, ఫిబ్రవరి 9: పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. ప్రధానిగా ఉంటూ నిండు సభలో అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి బైక్లతో భారీ ర్యాలీ తీశారు. నల్ల జెండాలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం పీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి గిట్టకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ సమైక్యతకు పాటు పడాల్సిన బీజేపీ ప్రభుత్వం రాజకీయ స్వార్థం కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తెలంగాణపై ప్రేమ ఉంటే విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.