మంథని, ఫిబ్రవరి 2: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకిచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు, 420 హామీలని తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గుర్తు చేశారు. ఈ వాగ్దానాలను మార్చి 17లోగా అమలు చేయాల్సిందేనని, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ నేతృత్వంలో మంథని పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో కలిసి ఎమ్మెల్సీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకోలేదని, అందుకే ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చిందని ఎద్దేవా చేశారు. తీరా అధికారంలోకి రావడంతో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక గందరగోళంగా పాలన చేస్తున్నదని విమర్శించారు. సరైన నాయకులు లేక పూటకో పార్టీ మార్చే రేవంత్రెడ్డికి సీఎం పదవి అప్పగించిందన్నారు. కాంగ్రెస్ రాకతో కరెంట్ కోతలు మొదలయ్యాయని చెప్పారు. రైతుబంధు రాక, సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు లాంటి రాజకీయ ఉద్దండులను ఎదురించి కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారన్నారు. వచ్చిన తెలంగాణను పదేండ్లలో అన్నింటా ముందుంచారని ప్రశసించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్లాల్, ఎగోలపు శంకర్గౌడ్, తగరం సుమలత, కర్రు నాగయ్య, ఎక్కటి ఆనంతరెడ్డి, జక్కు రాకేశ్, ఆరెపల్లి కుమార్, ఆకుల కిరణ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయిన్రు. ఆ పార్టీ పాలనలో ఎండకాలం రాకముందే కరెంట్ కోతలు మొదలైనయి. రైతుబంధు రాలేదు. నీరందక పొలాలు బీళ్లుగా మారుతున్నయి. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చేతులెత్తేసింది. పోరాడి సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిండు. ప్రజలు ఆలోచించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
రేవంత్రెడ్డి, కేసీఆర్ పాలనలో తేడాను ప్రజలు గమనిస్తున్నరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది. వారిచ్చిన గ్యారెంటీలన్నీ ఉత్తవేనని తేలిపోయింది. వాళ్లు అధికారంలో ఉండేది ఐదేండ్లే. ఆ తర్వాత ఆ పార్టీ దిగిపోవడం ఖాయం. కేసీఆర్ పాలనలోనే గడపగడపకూ సంక్షేమ పథకాలు చేరినయి. ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు అందినయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చేపట్టిన స్కీంలను వివరించి ఓట్లు అభ్యర్థించాలె. బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలె.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు (పెద్దపల్లి)