కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 6 : ‘బీసీల అభివృద్ధి కోసం మూడు ప్రధాన డిమాండ్లతో ముందుకు సాగతున్నాం. అందులో మొదటిదైన అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటే లక్ష్యంగా ముందడుగు వేద్దాం’ అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ హకుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ఆరు నెలల్లో కులగణన చేపట్టాలని, ఆ ప్రక్రియ తక్షణమే ప్రారంభించాన్నారు. ఈ 2024-25 బడ్జెట్లో బీసీ సంక్షేమం కోసం 20 వేల కోట్లు కేటాయించాలని, అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుపై ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
లేకుంటే ఏప్రిల్ 12న వివిధ రాష్ర్టాల ప్రతినిధులతో కలుపుకుని ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 1931లో కులగణన జరిగిందని, తర్వాత యూపీఏ ప్రభుత్వం 4500 కోట్లు ఖర్చు చేసి కులగణన చేపట్టినా ఆ వివరాలను ప్రజల ముందు పెట్టలేదని గుర్తు చేశారు. కర్నాటకలో కులగణన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ, బిహార్లో కులగణనకు సంబంధించి కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయన్న సాకుతో చేతులెత్తేసిందని విమర్శించారు. తెలంగాణలో అలా జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బీసీలు ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు అవుతారని ఆ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా అందుకు సంబంధించి ముందడుగు వేయలేదని విమర్శించారు.
పరిపాలనలో బీసీల భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇచ్చిన హామీ మేరకు బీసీల సంక్షేమానికి బడ్జెట్లో ఏటా 20 వేల కోట్లు కేటాయించాలన్నారు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ అవకాశాన్ని ఇవ్వడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 4,365 మంది సివిల్స్కు ఎంపికైతే.. అందులో 1195 మంది మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై బీసీ మేధావులు గళమెత్తాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఇటీవల ప్రవేశ పెట్టిన 26 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం 5 వేల కోట్లే కేటాయించిందని విమర్శించారు. హకుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ ముందువరసలో ఉందని, భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేదర్ విగ్రహం సాధించామన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యోగ కల్పనకు దారిచూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు.ఈ సమావేశానికి నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి రాజేశంగౌడ్, నాయకులు బొల్లం శివశంకర్, రాజారాంయాదవ్, కేవీ మహేందర్, వరాల శ్రీనివాస్, మేయర్ వై సునీల్రావు, భారత జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ఆచారి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పసుల చరణ్, జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్, గందె కల్పన, బాలసంకుల అనంతరావు, శివరాణి, విష్ణువర్ణన్, సంతోష్, గట్టెపల్లి దీపక్ పాల్గొన్నారు.
ఫూలేకు భారత రత్న ఇవ్వాలని కోరాం
జ్యోతిబాఫూలేకు భారత రత్న ఇవ్వాలని అప్పటి కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్తో కలిసి మోదీ ప్రభుత్వాన్ని కోరాం. జీరో అవర్లోనూ ఈ విషయంపై చర్చించాం. ఈ విషయంపై బీజేపీ ప్రభుత్వం నోరు మెదపలేదు.
సమాజానికి వెన్నెముక బీసీలు
సమాజంలో బీసీలు అంటే వెనుబడ్డవారు కాదు. సమాజానికి వెన్నెముకలాంటి వారు. ఎమ్మెల్సీ కవిత ఆ రోజు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాడి, విగ్రహ ఏర్పాటులో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇదే క్రమంలో ఫూలే విగ్రహ ఏర్పాటుకు పూనుకున్నారు. ఆమెకు తెలంగాణ బీసీలంతా అండగా ఉందాం.
– గట్టు రామచందర్, యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్