జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం కోరుట్లలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు హాజరుకానున్నారు. ఆరుచోట్ల బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మినీ స్టేడియంలో బతుకమ్మ ఆడడంతో పాటు, పండుగ విశిష్టతతో పాటు, సాంస్కృతిక అంశాలపై ప్రసంగించనుండగా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
– కోరుట్ల, అక్టోబర్ 20
కోరుట్ల, అక్టోబర్ 20: కోరుట్ల పట్టణంలో శనివారం భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల్లో భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈ సందర్భం గా ఉదయం 11 గంటలకు జగిత్యాలకు రానున్న కవిత, పట్టణంలోని ఇందిరా రోడ్డులో ఉన్న ప్రసాద్ సెలక్షన్స్ అధినేత బాలె నర్సయ్య, వైశ్య సంఘం వాసవి కల్యాణ భవనంలో, బీఆర్ఎస్ నాయకులు బొమ్మ రాజేశం, బెల్లాల ప్రశాంత్, సుజాత, పిన్నంశెట్టి ఆనంద్ ఇంట్లో బతుకమ్మను పేర్చే కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం 5 గంటలకు నంది చౌరస్తా నుంచి బతుకమ్మలతో శోభాయాత్రగా తరలివచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల మినీ స్టేడియంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడనున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టతతో పాటు, సాంస్కృతిక అంశాలపై ప్రసంగిస్తారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు. పట్టణంలోని మహిళలు, యువతులు బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను భారత జాగృతి జిల్లా, రాష్ట్ర నాయకులు పరిశీలించారు. బతుకమ్మ సంబురాల్లో పాల్గొనే మహిళలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.