జగిత్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలో అధికారం కోసం దిగజారడం ఎంత వరకు సబబని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్, జగిత్యాల కౌన్సిల్లో బీఆర్ఎస్కు మెజార్టీ ఉందని, ఎమ్మెల్యే సూచించిన వారే అధ్యక్షులు అవుతారని చెప్పి ఇప్పుడు ఇలాంటి కుట్రలకు పాల్పడుతారా..? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా..? అని మండిపడ్డారు. సిద్ధాంతాల కోసం పార్టీలు మారిన వారు ఉన్నరే కానీ, అధికారం, పదవుల కోసం పార్టీలు మారింది మాత్రం జీవన్రెడ్డినని విమర్శించారు.
బీఆర్ఎస్ విప్ను ధిక్కరించిన తొమ్మిది మంది కౌన్సిలర్లను డిస్క్వాలిఫై చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నామని, ఆయనకు ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకమున్నా అడ్డుకోవద్దని సూచించారు. బుధవారం జగిత్యాలలోని తన క్యాంపు ఆఫీసులో సంజయ్ విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల కౌన్సిల్లో 48 వార్డులకు ఒక స్థానం ఖాళీ ఉందని, 47 మంది కౌన్సిలర్లు ఉన్నారని, అందులో 29 మందితో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నదని చెప్పారు.
అనివార్య కారణాలతో బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా చేయగా, మున్సిపల్ నిబంధనల ప్రకారం వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారన్నారు. కానీ, జీవన్రెడ్డి బీసీలకు కేటాయించిన మున్సిపల్ చైర్పర్సన్ సీట్లో ఓసీలను కూర్చోబెట్టారంటూ విమర్శలు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ చట్టం 2020కు సవరణ చేశారని, ఈ మేరకే స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలకు ఎన్నిక నిర్వహింపజేస్తామని జీవన్రెడ్డి చెప్పారన్నారు. కానీ, ఇప్పుడు జీవన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తెరవెనక కుట్ర చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్లకు విప్ జారీ చేసినా, ఆ విప్ను ధిక్కరించి చైర్పర్సన్గా బరిలో నిలిచిన అడువాల జ్యోతికి కాంగ్రెస్కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు మద్దతుగా నిలువడం అత్యంత హేయమైన చర్య అన్నారు. జీవన్రెడ్డికి మొదటి నుంచి పదవి కోసం పార్టీలు మార్చే గుణం, నైజం ఉందని విమర్శించారు. ఆయన 1983లో ఎన్టీఆర్ ఆశీస్సులతో మంత్రి అయ్యారని, ఆ తర్వాత ఎన్టీఆర్నే గద్దె దించారన్నారు. జీవన్రెడ్డి, ఆయన కుటుంబం అరాచక పాలనను జగిత్యాల పట్టణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. 2009 నుంచి జీవన్రెడ్డి జగిత్యాలలో మెజార్టీని సాధించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఎందుకు విప్ జారీ చేయించలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా, లేక ఎన్నికకు గైర్హాజరైనా బీఆర్ఎస్ బీఫాం పొందిన అభ్యర్థి చైర్పర్సన్గా గెలిచేవారన్నారు. కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేయకుండా తతంగం నడిపారని ఎమ్మెల్యే విమర్శించారు. స్థానిక సంస్థల ప్రాధాన్యత గురించి ప్రెస్మీట్లు పెట్టి చెప్పిన జీవన్రెడ్డి, గ్రామ సర్పంచ్ల ఎన్నికల గడువు ముగిసినా ఎందుకు ఎన్నికలు నిర్వహింపజేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జగిత్యాలలో మాత్రం ఎమ్మెల్యేగా తానే గెలిచానని, అయితే జీవన్రెడ్డి అనుచరులు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్సీ చెప్పిందే నడుస్తుందని మాట్లాడడం ఎంత వరకు సబబు అన్నారు.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీవన్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆ సమయంలో సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏటా రూ. 3కోట్లు ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. నిబంధనల నేపథ్యంలో వైస్ చైర్మన్లుగా ఉన్న ఓసీలు.. ఇన్చార్జి మున్సిపల్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా వ్యవహరిస్తే బీసీలకు అన్యాయం జరిగిందని గొంతు చించుకున్నారని, అదే జగిత్యాల, రాయికల్ వ్యవసాయ మారెట్ కమిటీలను ఓసీలకు ఇవ్వడం వల్ల బీసీలకు అన్యాయం జరగడం లేదా? అని ప్రశ్నించారు.
రానున్న ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీసీ మంత్రం జపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జీవన్రెడ్డి ఏ సమావేశాలకు వెళ్లినా, సమావేశాల్లో తాను కాపుకులానికి చెందిన వాడినని చెబుతాడని, బీఆర్ఎస్ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా కాపు కులానికి చెందిన సమిండ్ల వాణికి అవకాశం కల్పిస్తే, ఆమెకు వ్యతిరేకంగా ఎలా కుట్ర చేస్తారన్నారు. ఈ విషయంలో కాపు కులస్తులకు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, ఉపాధ్యక్షుడు ఓల్లెం మల్లేశం, మాజీ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్ లు ఆవారి శివ కేసరి బాబు, కూసరి అనిల్, కూతురు రాజేశ్, కోరే గంగమల్లు, బొడ్ల జగదీశ్, ఎంపీటీసీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ విప్ను ధిక్కరించిన తొమ్మిది మంది కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని బుధవారం రాత్రి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాకు ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల చట్టం అనుగుణంగా పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన కౌన్సిలర్ల సభ్యత్వం రద్దవుతుందన్నారు. విప్ ధిక్కరించిన కౌన్సిలర్ల సభ్యత్వం రద్దు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా పార్టీ ఆదేశాలు, విప్ జారీ పత్రాలను కలెక్టర్కు అందజేశారు.