జగిత్యాల టౌన్, జనవరి 1 : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక దేవిశ్రీ గార్డెన్స్లో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని పేర్కొన్నారు.
తాను ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల వెంట ఉన్నానని భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల కోసం పాటుపడతానన్నారు. అందరికీ ప్రభుత్వ విద్య నైతిక విలువలతో కూడిన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల వెంట ఎల్లప్పుడూ ఉంటానని ప్రజల మనిషిగా ప్రజలతో మమేకమై పనిచేస్తానన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, సీపీఎస్ రద్దు ఆర్థికపరమైన అంశాలు, పీఆర్సీ, డీఏల మంజూరు కోసం తప్పక కృషి చేస్తానన్నారు. వీటితోపాటు మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటామని చెప్పారు. ప్రతి పాఠశాలకు స్కావెంజర్ను నియమిస్తామన్నారు.
తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాదరావు, డాక్టర్ తాటిపాముల సురేశ్కుమార్, రాష్ట్ర సహాధ్యక్షుడు ఐల్నేని నరేందర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి వీరమల్ల వెంకటరమణారావు, రాష్ట్ర బాధ్యులు లింబగిరి స్వామి, ఎలిగేటి రాజేంద్రప్రసాద్, గడ్డం మైపాల్రెడ్డి, నీలిమ, జయ, భాగ్యలక్ష్మి, రఘునందన్, రాజేందర్, రజనీకాంత్, రమేశ్, జిల్లాలోని వివిధ మండలాల తపస్ జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.