కోరుట్ల, మార్చి 12: కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నడు..ఆయనకు దమ్ముంటే అవినీతిని ని రూపించాలి.’ అని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన ఆయన అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. కోరుట్ల ప్రజలే తన కుటుంబంమని, అందుకే ఆపారమైన నమ్మకంతో నాలుగుసార్లు గెలిపించారని వ్యాఖ్యానించారు.
కోరుట్ల కార్నర్ మీటింగ్లో రేవంత్రెడ్డి ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ను చదివి ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడారని విరుచుకుపడ్డారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నానని చెప్పారు. తన కొడుకు సంజయ్ ప్రజాప్రతినిధులతో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తే తప్పేంటని నిలదీశారు. తన భార్య పోలీసు ఫైరవీలు చేస్తుందని రేవంత్రెడ్డి మాట్లాడం విడ్డూరమన్నారు. ఆదివారం ఆయన కో రుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను ఏకరువుపెడుతూ ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించారు.
కాంగ్రెస్ పాలన శిలాఫలకాలకే పరిమితమైందని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రగతి పరుగులు పెడుతున్నదని పేర్కొన్నారు. కోరుట్ల, మెట్పల్లిల్లో 100 పడకల దవాఖానలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నామని, డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశామని, రహదారులు, డ్రైనేజీలను అభివృద్ధి చేశామని తెలిపారు. భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నామని, సాగుభూములకు నీరందిస్తున్నామని చెప్పారు. సొంతజాగా ఉండి ఇల్లు కట్టుకునే మూడు వేల మందికి రూ. 3లక్షలు, దళితబంధు కింద 1100 మందికి, మరో మూడు వేల మందికి డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
తాను క్రాస్ ఓటింగ్ చేయలేదు..
తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయలేదని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. గిట్టనివారే అబద్ధపు ప్రచారం చేశారని ఆక్షేపించారు. డబ్బులు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేసినట్లు నిరూపిస్తే కోరుట్ల అంబేద్కర్చౌరస్తా వద్ద ఉరేసుకుంటానని ఆనాడే ప్రకటించానని గుర్తు చేశారు. తాను నిజాయితీపరుడిని కాబట్టే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు పిచ్చివాళ్లకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పి చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. బండి సంజయ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఆయన వెంటనే భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యాసాగర్రావుపై ఆరోపణలు విడ్డూరం
– జడ్పీ చైర్పర్సన్ దావ వసంత
పజా సమస్యల పరిష్కారానికి నిర్విరామంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే విద్యాసాగర్రావుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఖండించారు. జిల్లాలో పాదయాత్ర చేస్తు న్న రేవంత్రెడ్డికి పచ్చని పంటపొలాలు, హరితవనాలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఆయనకు కండ్లు కనిపించకుంటే కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, సరోజన దంపతులపై రేవంత్ అనుచిత వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సం జయ్ చేసిన వ్యాఖ్యలు మహిళా జాతికే కళంకం తెచ్చేలా ఉన్నాయని ఆక్షేపించారు. బీజేపీ అధికారం కోసం బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ పేరిట దాడులకు దిగుతున్నదని విమర్శించారు. వారికి ప్రజాక్షేత్రంలో పరాభావం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్లు అన్నం లావణ్య, రణవేణి సుజాత, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు.