కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : బండి సంజయ్ డొల్ల మాటల మనిషేనని, ఆయన గురించి కరీంనగర్ ప్రజలకు తెలిసి పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. బండి చేసిందేమీ లేదని మండిపడ్డారు. మాటలు తప్ప చేసిందేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ను గెలిపిస్తే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిధులు తెచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఆయనను ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, వచ్చే నెల 13వ తేదీ నాడు మీ ఓటుతో బీజేపీ, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పి వినోద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో పాలనగాడి తప్పి నిత్యావసరాల ధరలు సైతం పెరిగాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దేవుళ్లపై ప్రమాణం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్రెడ్డి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్లు సెంటిమెంట్ రగిలించి ప్రజలను మోసం చేసినట్టు ఇప్పుడు అలా మోసం చేయడం కుదరదని స్పష్టం చేశారు. మరోసారి మోస పోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు.
బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీతో కుమ్మక్కయింది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. నాడు ఉప ఎన్నికల్లో హుజూరాబాద్లో బలహీనమైన అభ్యర్థిని నిలిపి పరోక్షంగా బీజేపీని గెలిపించింది ఆయనేనని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. నామినేషన్ల పర్వం ముగుస్తున్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ కూడా బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి పరోక్షంగా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల్లో సెంటిమెంట్ను రగిలించి పబ్బం గడుపుకోవాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయని, ఈ విషయాన్ని కరీంనగర్తోపాటు రాష్ట్ర ప్రజలు గమనించారని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తాగు, సాగు నీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించి, అభివృద్ధిని పరుగులు పెట్టించారని, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. అలాంటి పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత, మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నదని చెప్పారు. విజ్ఞులైన కరీంనగర్ ప్రజలు, మేధావులు, కవులు, రచయితలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విజ్ఞానవంతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వినోద్ విద్యావంతుడు, మేధావి, అభివృద్ధి సాధకుడు. ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమంలో పని చేసిండు. ఎంపీగా కరీంనగర్కు ఎంతో చేసిండు. రైల్వేలైన్, స్మార్ట్ సిటీని సాధించిండు. వినోద్కుమార్ లాంటి వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నరు. మేధావులు, విజ్ఞులు అందరూ ఆలోచించాలి. కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలన్నా.. మేలు జరగాలన్నా.. వినోదన్నను ఆశీర్వదించాలి. ఆయన గెలిస్తే పార్లమెంట్లో ప్రజా గొంతుక అయితడు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న నిధులు తెస్తడు.