మల్యాల (కొడిమ్యాల), మే 26: అది మల్యాల మండలం బల్వంతాపూర్ నుంచి సర్వాపూర్ మీదుగా మల్యాల శివారులో పీడబ్ల్యూ రోడ్డును కలిపే ప్రధానమార్గం. ఈ గ్రామాల ప్రజలు ఏ అవసరం ఉన్నా ఈ రోడ్డు గుండానే మల్యాల కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, మట్టి రోడ్డు కావడంతో చాలా అవస్థలు పడుతున్నారు. బీటీ రోడ్డు వేయాలని ఇక్కడి ప్రజలు గత ప్రభుత్వాలను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల టైంలో నేతలు హామీ ఇవ్వడం, ఆ తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఇలా దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
స్వరాష్ట్రంలో తీరిన కల
దశాబ్దాల నాటి రోడ్డు కల స్వరాష్ట్రంలో తీరింది. విషయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రూ.3.29కోట్లు మంజూరు చేసింది. బల్వంతాపూర్ నుంచి సర్వాపూర్ మీదుగా 5కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించి మల్యాల నుంచి తాటిపెల్లి వెళ్లే పీడబ్ల్యూ రోడ్డుకు అనుసంధానించనుండగా, శుక్రవారం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా మెరుగుపడనుండగా, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
30 ఏండ్ల కల నెరవేరింది
బల్వంతాపూర్ నుంచి సర్వాపూర్ మీదుగా మల్యాల దాకా మట్టి రోడ్డుతో 30 ఏండ్లుగా అవస్థలు పడుతున్నాం. మాకు ఏ అవసరం ఉన్నా మండల కేంద్రమైన మల్యాలకు వెళ్లాల్సిందే. ఈ ఒక్క రోడ్డే దిక్కు. ఎంతో మంది నాయకులను అడిగినం. ఎవరూ పట్టించుకోలే. కానీ ఎమ్మెల్యే రవిశంకర్ కృషితో మా కల నెరవేరింది. ఈ రోజే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమైనయి. చాలా సంతోషంగా ఉంది.
– తైదల శ్రీలత, మాజీ ఎంపీపీ (బల్వంతాపూర్)
మాట నిలబెట్టుకున్నడు
రోడ్డు కావాలని ఏండ్లుగా కోరుతున్నం. ఎన్నికల టైంల అందరూ వచ్చుడు.. రోడ్డు వేయిస్తామని మాటిచ్చుడు తప్ప ఏ ఒక్కరూ నెరవేర్చలేదు. కానీ ఎమ్మెల్యే రవిశంకర్ సారు ఆనాడు రోడ్డును నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతా అని మాట ఇచ్చిండు. అనుకున్నట్లుగానే 3.29కోట్లు మంజూరు చేయించి, ఇయ్యాల పనులు ప్రారంభించిండు. మాటనిలబెట్టుకున్న ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.
– బొమ్మకంటి శ్వామల, బల్వంతాపూర్