రామడుగు, డిసెంబర్ 1 : విద్యాశాఖ ఆదేశాలతో నవంబర్ 28 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువారం ఉదయాన్నే గోపాల్రావుపేట బడిని ఆకస్మికంగా సందర్శించారు. ఆరుబయట కూర్చొని చదువుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే పలుకరించారు. 9.30 గంటలకు విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. తప్పనిసరిగా యూనిఫాంలోనే రావాలని పిల్లలకు సూచించారు. అనంతరం ఆంగ్లం, తెలుగు మీడియం పదో తరగతి విద్యార్థుల తరగతి గదికి వెళ్లి టీచర్గా మారి పాఠ్యాంశాలు బోధించారు. గంగాధర మండలం మర్రిగడ్డకు చెందిన విద్యార్థి పాఠశాలకు ఆలస్యంగా రాగా, కారణాలేంటని అడిగి తెలుసుకున్నారు. సదరు విద్యార్థి తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ, అబ్బాయికి వెంటనే సైకిల్ కొనివ్వాలని సూచించారు. లేదంటే తానే కొనిస్తానన్నారు. పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల పేరెంట్స్ ఫోన్ నంబర్లు తీసుకొని వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు.
పదో తరగతి పరీక్షలు రెండు, మూడు నెలల్లో ఉన్నాయని తెలిపారు. అనంతరం విద్యాబోధన ఎలా ఉందని, టీచర్లు ఏ విధంగా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు వ్యాకరణానికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల నోట్ పుస్తకాలను పరిశీలించి, చేతి రాత బాగుంటేనే తలరాత బాగుంటుందని పేర్కొన్నారు. స్కూల్లో టీచర్ల హాజరు శాతం ఎంత ఉంది?.. బయోమెట్రిక్ ఏర్పాటు చేశారా? అని ఇన్చార్జి హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు. ఇంకా బయోమెట్రిక్ ఏర్పాటు చేయకపోవడంపై డీఈవోతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. ఆయనవెంట మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, చొప్పదండి ఏఎంసీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, స్థానిక ఏఎంసీ డైరెక్టర్ కొలిపాక మల్లేశం, మాజీ డైరెక్టర్ పైండ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ చొప్పదండి మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎడవెల్లి పాపిరెడ్డి, పూడూరి మల్లేశం, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బుర్ర సాయిలుగౌడ్ ఉన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు అహర్నిశలూ కృషిచేయాలి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి విద్యార్థీ కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చింది. నాణ్యమైన విద్యను అందిస్తున్నది. మన ఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలలను ఆధునీకరిస్తున్నది.
– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్