బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం, బలగమని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. ఉద్యమంలో తాను సామాన్య కార్యకర్తనని, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నానని, ఉద్యమకారులందరికీ న్యాయం జరుగుతుందనేందుకు తానే ఒక నిదర్శనమని చెప్పారు. చొప్పదండి పట్టణంలోని జీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చొప్పదండి రూరల్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన, జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.
-చొప్పదండి, మార్చి 31
చొప్పదండి, మార్చి 31: బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం, బలగమని, మీ కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. దేశ ప్రధానిగా మోదీకి ప్రజలు అవకాశమిస్తే చాయ లెక్కనే దేశాన్ని అమ్మేస్తున్నాడని విమర్శించారు. ప్రధానమంత్రికి రైతులంటే ఇష్టం లేదని, అధిక ధనవంతులకు వత్తాసు పలుకుతూ పేదోళ్లను దోచి పెద్దోళ్లకు పెడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు, ఉద్యోగాలు, మెట్రోలైన్, పసుపు బోర్డు, విభజన హామీలు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చూపిస్తున్నదని దుయ్యబట్టారు. చొప్పదండి పట్టణంలోని జీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చొప్పదండి రూరల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ కృష్ణారావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి, అమరవీరుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాక ముందు చొప్పదండి నియోజవర్గాన్ని ఎవరూ పట్టించుకోక అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తాను స్థానికంగా ఉంటూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చొప్పదండి పట్టాణాన్ని 70 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానన్నారు. నాడు నాయకులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిజమైన హిందువని, కొండగట్టు అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేశారని, అవసరమైతే వెయ్యి కోట్లు ఇసాన్తన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని సుమారుగా 1200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆశీస్సులతో ఇంకా మరిన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీసుకొచ్చిన ఘనత వినోద్కుమార్కే దక్కుతుందని కొనియాడారు. కరీంనగర్లోని చొప్పదండి రోడ్డులో రైల్వె గేటు పడి చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్న సోయి బీజేపీ నాయకులకు లేదని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం వినోద్కుమార్ ప్రయత్నం చేస్తున్నారని, టెండర్ కూడా పూర్తయిందని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ను తీసుకొచ్చిన ఘనత కూడా వినోద్కుమార్కే దక్కుతుందన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లు అని, వారందరిని కలిపే వేదికగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమ్మేళనానికి మండలంలోని 16 గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు 2వేల మంది తరలి వచ్చారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పట్ణణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా నుంచి జీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ తీశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు బందారపు అజయ్కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకట రమణారెడ్డి, జిల్లా సభ్యులు మచ్చరమేశ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు గుంట రవి, వెల్మ నాగిరెడ్డి, పెద్ది శంకర్, సురేశ్, తొట్ల గంగమల్ల య్య, లింగంపెల్లి లావణ్య, చిలుకల లింగయ్య, ఎంపీటీసీలు వెల్మ విజయలక్ష్మి, కట్టెకోల తార, కోఆప్షన్ సభ్యులు పాషా, నాయకులు మాచర్ల వినయ్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మామిడి రాజేశం,గోపు శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు స్వామిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, సీపెల్లి గంగ య్య, భూమయ్య, మారం యువరాజ్ పాల్గొన్నారు.
రిజర్వేషన్ల ఘనత కేసీఆర్దే..
దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల కోసం రిజేర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. మహిళల అభివృద్ధే ధ్యేయంగా మహిళల కోసం అనేక సంక్షమ పథకాలు ప్రవేశ పెడుతూ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
– మాచర్ల సౌజన్య, జడ్పీటీసీ (చొప్పదండి)
మనకు మనమే పోటీ..
మన పాలనలో మనకు మనమే పోటీ. ఇతర పార్టీలు పోటే కాదు. ప్రతిపక్ష పార్టీలు పనిచేసే చేతకాక ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అసత్య అరోపణలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు వాటిని తిప్పికొట్టాలి.
– చిలుక రవీందర్, ఎంపీపీ (చొప్పదండి)
సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు
రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. వాటిని మన ప్రచారం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. దేశవ్యాప్తంగా 12 రాష్ర్టాల నుంచి కూలీలు ఇక్కడకు వచ్చి పని చేస్తున్నరు. అందరూ కలిసి మెలిసి పని చేసి పార్టీని బలో పేతం చేయాలి.
– వెల్మమల్లారెడ్డి, సింగిల్విండో చైర్మన్ (చొప్పదండి)
కార్యకర్తలే పార్టీకి పునాదులు
కార్యకర్తలే పార్టీకి పునాది. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నియోజకవర్గంలో 147 గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తున్నది. ఉద్యమ నాయకులను గుర్తుంచుకుని సముచిత న్యాయం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ప్రతి పక్ష పార్టీల నాయకులు మాయమాటలను నమ్మవద్దు. ఎప్పటికప్పుడు తిపికొట్టాలి. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అభివృద్ధి గురించి పార్లమెంట్లో ఏనాడైనా మాట్లాడిండా..? ఒక్క రూపాయన్న తీసుకువచ్చి అభివృద్ధి చేసిండా?. రేవంత్రెడ్డి ఒక దొంగ. 2014 ముందు చంద్రబాబునాయుడుతో కలిసి తెలంగాణ రాష్ర్టానికి అడ్డు పడ్డ వ్యక్తి. ఆయన రాజకీయ పబ్బంగడుపుకోవడానికి మళ్లీ ప్రజల దగ్గరకు వస్తున్నడు. ఆయన మాటలు నమ్మి మోసపోకుండా వారిని తిప్పికొట్టాలి. చొప్పదండిలో ఆత్మీయ సమ్మేళనం చాలా బాగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు చేసిన ఈ సమ్మేళనానికి కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉంది.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ, కార్యకర్తలకు పదవులను ఇస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. మేం కార్యకర్తలుగా ఉండి జెండాలు కట్టినం. జెండాలు పంచినం. ఆ స్థాయి నుంచి నాయకలయ్యే స్థాయికి తీసుకవచ్చిన పార్టీ బీఆర్ఎస్.. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. కాంగ్రె స్, బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేయాలి.
– పొన్నం అనిల్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
ఉద్యమంలో ఉన్నందుకు గర్వంగా ఉన్నది
తెలంగాణ ఉద్యమంలో మేమున్నాం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టే ప్రక్రియ ఆరంభమైంది. భారతదేశం లో కేసీఆర్ను ప్రధానిని చేయడమే ఎజెండాగా బీఆర్ఎస్ సభ్యులందరు శ్రమించాలి. కార్యకర్తలు అందరు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించుకోవాలి.
-ఏనుగు రవీందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
పార్టీని బలోపేతం చేయాలి
ప్రతి కార్యకర్త పార్టీని కాపాడుకుంటూ బలోపేతం చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు కావాలంటే బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ వచ్చేలా పని చేయాలి.
– గడ్డం చుక్కారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, చొప్పదండి