సాగునీటి విజయోత్సవ వేడుక అంబరాన్నంటింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పండుగలా సాగింది. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించగా, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సాగునీటి రంగంలోనే సువర్ణధ్యాయాన్ని లిఖించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం రూపొందించిన డ్యాకుమెంటరీని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వీక్షించారు. నాడు సాగునీటి కోసం పడిన ఇబ్బందులు, నేడు పుష్కలంగా తరలివస్తున్న జలాలతో పొందుతున్న ప్రయోజనాలను అధికారులు వివరించారు. అనంతరం అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ సీఈవో ప్రియాంక, జమ్మికుంటలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావు, సుడా చైర్మన్ జీవీఆర్ పాల్గొన్నారు. కాగా, రాత్రి నగరంలోని మానేరు తీరంలో నిర్వహించిన లేజర్ షో ఆకట్టుకున్నది.
– కరీంనగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ దినోత్సవం, దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో నిర్వహించిన సాగు నీటి దినోత్సవం విజయోత్సవంగా సాగింది. నియోజకవర్గాల వారీగా నిర్వహించిన వేడుక అంబరాన్నంటింది. తెలంగాణ సర్కారు వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రీ ఇంజినీరింగ్, విధానంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసిందని, రాష్ట్రంలో నూతన వ్యవసాయ విప్లవాన్ని తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఈ సభల్లో పాల్గొన్న వక్తలు కొనియాడారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సభలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఈఈ రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తలాపున పారుతున్న గోదావరి ఉన్నా.. మన చేను చెలకలు ఎడారిగా మారి దుర్భర పరిస్థితుల నేపథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ర్టాన్ని సాధించుకున్నామని, మన నీళ్లు మనకే వాడుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకొని తెలంగాణను సస్యశ్యామల చేసుకున్నామన్నారు.
జమ్మికుంట స్వాతి గార్డెన్లో జరిగిన సభలో మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని పథకాలన్నీ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. గంగాధర మండలం కురిక్యాల శుభమస్తు ఫంక్షన్హాల్లో జరిగిన సభలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎంపీపీలు శ్రీరాం మధుకర్, చిలుక రవీందర్, పర్లపెల్లి వేణుగోపాల్, జడ్పీటీసీలు పునుగోటి ప్రశాంతి, పుల్కం అనురాధ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులను నింపి తెలంగాణను సస్యశ్యామలం చేసిన సీఎం చిత్రపటానికి రైతులు, మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు.
తొమ్మిదేళ్ల కాలంలో సాగనీటి రంగంతో సాధించిన అభివృద్ది, విజయాలపై ముద్రించిన పుస్తకాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కరీంనగరంలోని వీ కన్వెన్షన్లో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. కాగా, సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం రూపొందించిన డ్యాకుమెంటరీని ప్రదర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, దానిపై ఆధారపడిన అనుబంధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సేద్య ప్రాంతాల వివరాలను డ్యాకుమెంటరీ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఆకట్టుకున్న లేజర్ షో ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్ శివారులోని లేజర్ షో ఆకట్టుకుంది. రాష్ట్రం సాధించిన తర్వాత సాధించిన విజయాలను వివరిస్తూ ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది. ఈ షోలో భాగంగా ప్రతి 30 నిమిషాలకు ఒక సారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రదర్శించారు.