పాలకుర్తి,సెప్టెంబర్7: స్వరాష్ట్రంలో ఇంటింటా పథకాల పంట పండుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. గురువారం పాలకుర్తి మండలం బసంత్నగర్, ఈసాలతక్కళ్లపల్లి గ్రామాల్లో 200 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈసాలతక్కళ్లపల్లిలో చెరువుపై రోడ్డు నిర్మాణానికి 64లక్షలు, మున్నురుకాపు, ముదిరాజ్ సంఘాల భవనాలకు 20 లక్షలు, బసంత్నగర్లో 12లక్షలతో సిమెంట్ రోడ్డు, 10లక్షలతో మైనార్టీ సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తక్కళ్లపల్లిలో 3 కోట్లు, బసంత్నగర్లో 5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు.
ఏరాష్ట్రంలో లేనివిధంగా సాగుకు 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. బసంత్నగర్ నుంచి ఈసాలతక్కళ్లపల్లి వరకు డబుల్రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఆలోచించాలని, పనిచేసే నాయకులకే పట్టంగట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలను నమ్మవద్దని కోరారు. నిరంతరం రాష్ర్టాభివృద్ధి కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, తహసీల్దార్ జ్యోతి, వైస్ఎంపీపీ ఎర్రంస్వామి తదితరులు పాల్గొన్నారు.