రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఆప్తులను కోల్పోయిన పలు కుటుంబాలను పరామర్శించారు. అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులు, చిన్నారులను ఆపాయ్యంగా పలుకరించారు.
ఆయాచోట్ల ప్రజల నుంచి వినతులు స్వీకరించి.. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ ఉదయం 11.30గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చేరుకున్నారు. గురువారం వివాహం చేసుకోనున్న సోషల్ మీడియా కార్యకర్త సాయికృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లారెడ్డిపేటలో రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు గుండాడి వెంకటరెడ్డి కొడుకు-కోడలు నరేశ్రెడ్డి-చందన దంపతులను ఆశీర్వదించారు. తర్వాత నూతనంగా సహకార సంఘ భవనాన్ని సందర్శించి చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, డైరెక్టర్లను అభినందించారు. హరిదాస్నగర్లో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు నూతన ఇంటికెళ్లారు.
అనంతరం పదిరలో దళితబంధు పథకం కింద ఏర్పాటు చేసిన ‘నయార’ పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. అక్కడి నుంచి ముస్తాబాద్ మండలం చేరుకుని అయ్యప్ప ఆలయంలో జరిగిన మహాపడి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప మాలధారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ యూత్ నాయకుడు గుణశేఖర్ సోదరి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత పోతుగల్లో హెల్పర్ జంగ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, గంభీరావుపేట మండలం శ్రీగాధలో సీనియర్ నాయకుడు మాణిక్రావు, చొక్కారావు కుటుంబ సభ్యులు, మండల కేంద్రంలోని ఎంపీటీసీ దేవేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకట్యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.