గోదావరిఖని, నవంబర్ 10: దీపావళి పండుగ తర్వాత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను గడగడపకూ తీసుకెళ్లాలని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. నాపై తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కేసులు నమోదయ్యాయి..అంతేగానీ ఎలాంటి నేరచరిత్రలేదని తెలిపారు. ఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్నటి తన నామినేషన్ మహోత్సవ ఆశీర్వాద సభకు వేలాదిగా హాజరై తనను ఆశీర్వదించి మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన తనపై 125 కేసులు నమోదు కాగా, అందులో 45 నాన్ బెయిలబుల్ కేసులేనన్నారు. 45 రోజుల పాటు జైలు జీవితం గడిపానని తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక తనపై ఉన్న కేసులన్నీ కొట్టివేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రమే గనుక సిద్ధించకపోతే తన జీవితమంతా కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరగడంతోనే గడిచిపోయేదన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత తనపై ఉన్న కేసులన్నీ కొట్టివేశారన్నారు. 2021లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల సమయంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వారు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించలేఏదని ఇన్ఛార్జిగా ఉన్న తనపై హోలియా పోలీస్స్టేషన్లో నమోదైన కేసు నాంపల్లి కోర్టులో పెండింగ్లో ఉండడం మినహా మరే విధమైన నేరచరిత్ర తనకు లేదని ఇతర కేసులు గాని తనపై లేవని ఈ విషయం ఎన్నికల కమిషన్కు తెలిపినట్లు వెల్లడించారు. తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ రామగుండం నియోజక వర్గ అభ్యర్థిగా గొప్ప అవకావం ఇచ్చారని చెప్పారు. ప్రజలు కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే మంత్రి కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే ముస్లింలకు సముచిత స్థానం లభిస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 41,49 డివిజన్ల పరిధిలోని అశోక్నగర్, గాంధీనగర్లో శుక్రవారం ముస్లిం మైనార్టీలను కలుసుకున్నారు. పేరు పేరునా పలకరించారు. సీఎం కేసీఆర్ ముస్లింల విద్య కోసం మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారనీ, రంజాన్ రోజున రంజాన్ తోఫాలను అందిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మత కల్లోహాలు లేని శాంతియుత పాలన సాగిస్తుందని ముస్లిం మైనార్టీల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 41వ డివిజన్లో కార్పొరేటర్ గాదం విజయ నందు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మహాలక్ష్మీ, దుబాసి లలిత, రాజ్కుమార్, నాయకులు మురళీదర్, జాహెద్ పాషా, పయాజ్, సత్యప్రసాద్, నూతి తిరుపతి, రవీందర్ రెడ్డి, అరవింద్, తోకల రమేశ్, సతీశ్, లక్ష్మణ్, మధు, రాజేశ్, వెంకటేశ్, మొగిలి, రాజయ్య, జావిద్, తాజ్, యాకుబ్, చోటు, షఫిఖాన్, అజ్జు, ఇమ్రాన్, గఫూర్ ఉన్నారు.