మెట్పల్లి రూరల్, సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత, అంతకు ముందు జరిగిన అభివృద్ధిలో తేడాను గుర్తించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని, రాబోయే ఎన్నికల్లో తన కొడుకు డా. సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్తో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజాసంక్షేమానికి చేపడుతున్న చర్యలు శూన్యమని విమర్శించారు. శనివారం మెట్పల్లి పట్టణంలోని వెంకట్రెడ్డి గార్డెన్స్లో మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఆసరా పింఛను గుర్తింపు కార్డులను బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయంతో పాటు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, ఆయా రంగాలను పటిష్టం చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో ఆసరా పింఛను 2,016, దివ్యాంగులకు 4,016 చెల్లిస్తున్నామని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 500 మాత్రమే ఇస్తున్నారన్నారు. అనంతరం చౌలమద్ది, రామారావుపల్లె, కోనరావుపేట, కొండ్రికర్ల, పెద్దాపూర్లోని పలు కుల సంఘాల అభివృద్ధికి మంజూరైన 33 లక్షల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచులు నల్ల యమున, మ్యాకల అర్చన, గడ్డం లింగారెడ్డి, కోరెపు రవి, తిగుర్ల లక్ష్మి, కోరెపు శ్యామల, ఎంపీటీసీ పుల్ల చంద్రశేఖర్గౌడ్, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు అనిరెడ్డి మారుతి, సహకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం రాజరెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతున్నది. ఎక్కడా లేనివిధంగా పథకాలు అమలవుతున్నాయి. సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేయాలి. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలి.
– డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి