ఇల్లంతకుంట, జనవరి 6 : అభివృద్ధే ధ్యేయంగా అందరూ పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లి, అనంతగిరి గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు.
ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ పథకం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నదన్నారు. అనంతరం ఆరు గ్యారెంటీలపై అవగాహన కల్పించారు. రేపాకలో గౌడ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, సర్పంచులు రోండ్ల లక్ష్మి, కాచారం శ్రీనివాస్ రెడ్డి, మంద సుశీల, పల్లె నర్సింహా రెడ్డి, ఎంపీటీసీ సుమలత, తహసీల్దార్ జావిద్ అక్బర్, ఎంపీడీవో మీర్జాతోపాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.