జగిత్యాల, జనవరి 11 : తన చిన్న కవితలతో మెరిపించి, సమాజ చైతన్యం కోసం పాటుపడిన అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వ సూర్యుడని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం అక్షర సూర్యుడు అలిశెట్టి జయంతి, వర్ధంతిని పురస్కరించుకొని గురువారం జగిత్యాలలోని శివసాయి రెసిడెన్సీలో కళాశ్రీ సాహితీ వేదిక అధినేత గుండేటి రాజు ఆధ్వర్యంలో అలిశెట్టి పురసారాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు.
జంగం స్వయం ప్రభ, సిరిపురం వాణిశ్రీ, డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర, డాక్టర్ పగిడిపెల్లి సురేందర్కు పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు సాహితీలోకం మర్చిపోలేని కవి అలిశెట్టి అని అభివర్ణించారు. అలతి పదాలతో అనంత అర్థాలు చెప్పి అనల్పమైన వాక్యాలతో శబ్ద శక్తిని, తన చిత్రాలతో మహా ఇతివృత్త శక్తిని అందించారని గుర్తు చేశారు.
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, అక్షరాన్ని ఆయుధం చేసి తన కవిత్వాన్ని ప్రాణ వాయువుగా మార్చి నింపాలని అలిశెట్టి తపించారని తెలిపారు. తెలంగాణ అలిశెట్టి కవి సమ్మేళనంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అలిశెట్టి తనయుడు సంగ్రామ్, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అలిశెట్టి మాధవి రాజు, ఉజగిరి జమున, మద్దెల సరోజన, అయిత అనిత, మోటూరి శ్రీనివాస్, చెట్ల చంద్రశేఖర్, బుర్ర శ్యామలగౌడ్, లకరాజు శ్రీలక్ష్మి, పసుల రవికుమార్, గుండేటి బేబిరాణి, సంకోజి రాధ శివకుమార్ పాల్గొన్నారు.