తిమ్మాపూర్, జూన్ 18: కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల ప్రజల గొంతు తడిపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని నీటి కోసం ఇబ్బందులు పడ్డారని, స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్ఎండీ కాలనీలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన మంచినీళ్ల పండుగకు రసమయితో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, మన నీళ్లు, మన నిధులు మనకే కావాలనే నినాదంతో తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మన నీటిని ఆంధ్రాకు తరలించి మన భూములు బీడుగా మారినా.. వారు మూడో పంట సాగు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గ్రామ గ్రామానికి కాలువల ద్వారా సాగు నీటిని సరఫరా చేస్తున్నారని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీటిని అందించి ప్రజల దూప తీర్చారని ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరందిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు.
ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతాల్లో 30 ఏళ్లకే ముసలితనం వచ్చేలా అనారోగ్య సమస్యలు ఉండేవని.. అందుకే కోట్లు ఖర్చు చేసి మంచినీటిని అందిస్తున్నామన్నారు. గతంలో అల్గునూర్ గ్రామానికి వెళ్లినప్పుడు మంచినీటి కోసం ఆడబిడ్డలు అడిగారని.. అల్గునూర్ గ్రామంపైనే మానేరు రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా మంచినీటికి ఇబ్బందులు ఉండేవన్నారు. నేడు ఏ గ్రామంలో చూసినా మంచినీటి సమస్య లేదని స్పష్టం చేశారు. మంచినీటి విషయంలో తెలంగాణ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. తాము ఓట్ల కోసం ఆరాటపడడం లేదని, ప్రజలకు సేవ చేయాలనే తపనతో పని చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రజలు ఇండ్లల్లో అమర్చుకునే ఫ్యూరిఫైర్ యంత్రాల్లో శుద్ధి చేసిన నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధ జలం అందిస్తున్నది. నియోజకవర్గంలో 424 మీటర్లు ఎత్తున ఉన్న మంజునాథ తండాకు కూడా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారు.
-వొడితల సతీశ్కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్