మానకొండూర్ రూరల్, నవంబర్ 27: రాష్ట్రంలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు. సోమవారం మానకొండూర్ మండల కేంద్రంతో పాటు ముంజంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, మానకొండూర్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ చేయడంతోపాటు ఇరువైపులా స్ట్రీట్ లైట్లు పెట్టించామని, చెరువు కట్టను రూ.3 కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా మార్చామని చెప్పారు.
50 ఏండ్లలో మండల కేంద్రంలో ఏనాడూ ఇరుకు రోడ్లను విస్తరించాలని ఆలోచనే చేయని వాళ్లు, అభివృద్ధి చేస్తామంటూ వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు మెరుగుపరిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలకు గ్యారెంటీ లేదు.. కవ్వంపల్లి మాటలకు వారంటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెబుతూ ఊర్లలోకి వస్తున్న వారిని నమ్మవద్దని సూచించారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాడు అభివృద్ధిని విస్మరించిందన్నారు. ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని నిలదీశారు. జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే గొప్ప నాయకుడు రసమయి బాలకిషన్ అని కొనియాడారు.
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మరోసారి రసమయి బాలకిషన్ను ఆశీర్వదించి, పట్టం కట్టాలన్నారు. కాగా, ఆయా గ్రామాల్లో రసమయి బాలకిషన్, జీవీఆర్ను సర్పంచులు, ఉప సర్పంచులు గజమాలలతో సన్మానించారు. ఆడబిడ్డలు, కోలాట కళాకారులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గడ్డం నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు కవిత, సులోచన, ఉప సర్పంచ్ నెల్లి మురళి, గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల మధు, నందగిరి మల్లయ్యాచారి, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నాయకులు, శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.