‘ఈటల రాజేందర్.. ఇదేనా నీ ఆత్మగౌరవం? తెలంగాణ వచ్చినందుకు నాలుగు రోజులు ముద్ద ముట్టలేదు అన్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకలజొచ్చినవ్. ఇప్పుడు నీ ఆత్మ గౌరవం ఎటు పోయింది? ఆంధ్రుల, ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టినవా..? బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసినవ్. ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేస్తున్నవ్. వెన్నుపోటుదారుడు ఈటల మనకు అవసరమా..? కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతం, గోసపడ్తం. హుజూరాబాద్లో యువకుడు పాడి కౌశిక్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. నియోజకవర్గాన్ని రూ.వెయ్యికోట్లతో నేనే దగ్గరుండి అభివృద్ధి చేయిస్తా.” అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రజలు తరలిరాగా, వారినుద్దేశించి మంత్రి ప్రసంగించారు.
– హుజూరాబాద్/జమ్మికుంట, నవంబర్10
హుజూరాబాద్/జమ్మికుంట, నవంబర్10 : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మోసపోతామని, గోసపడుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. నోరు విప్పితే ఆత్మ గౌరవమనే ఈటల రాజేందర్.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణను కించపరిచిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంకనజొచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆత్మ గౌరవం ఎటు పోయింది? ఆంధ్రుల, ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టావా..? అని ప్రశ్నించారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలో బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపోళ్లను నమ్మితే మోసపోతామని, గోసపడ్తామని చెప్పారు. హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరేయాలని, యువకుడు పాడి కౌశిక్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టికెట్లను అమ్ముకున్న రేవంత్రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ర్టాన్ని అమ్ముకోడనే గ్యారం టీ ఉన్నదా..? ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
సాగుకు పుష్కలంగా కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా..? మూడు గంటలు చాలన్న కాంగ్రెస్ కావాలా..? ప్రజలే తేల్చుకోవాలన్నారు. కేసీఆర్తోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని, దీనికి నిదర్శనమే తొమ్మిదేళ్ల పాలన అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్కు నమ్మక ద్రోహం చేశారని, ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటుదారుడు ఈటల మనకు అవసరమా..? చెప్పాలన్నారు. గజ్వేల్, హుజూరాబాద్ రెండింటా నామినేషన్ వేశారని, రెండు చోట్లా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఇక్కడ వేరే వ్యక్తిని గెలిపించుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. హుజూరాబాద్లో తప్పనిసరిగా కౌశిక్రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు కౌశిక్కు పుష్కలంగా ఉన్నాయని, నేనే దగ్గరుండి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
నిజం గడప దాటక ముందే.. అబద్ధం ఊరంతా చుట్టేస్తుందన్న చందంగా ఎన్నో అబద్ధాలు చెప్పి గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచాడని, నిజం నిలకడగా తెలుస్తుందన్నట్లు ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ ఎవరేంటో తెలిసిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు న్యాయం, ధర్మం గుర్తించాలని, కౌశిక్రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ఆపాయని, ఇంకో 20 రోజుల తర్వా త కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు ఆపుతారో చూస్తామన్నారు. రైతులను బిచ్చగాళ్లతో పోల్చిన రేవంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. మూడు గంటల కరెంటిస్తే.. మూడెకరాలు పారుతుందని తెలిసీ, తెలియని కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి అవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచారని, సంక్షేమం.. అభివృద్ధి ఒక ఉద్యమంలా సాగుతున్నదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల్లో సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలను వివరించారు. బీజేపీ ఇక్కడ వచ్చేది లేదు.. సచ్చేది లేదని, ఇప్పుడున్న మూడు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. ఢిల్లీ నుంచి పెద్ద నాయకులతో వస్తున్న ఈటల.. ఉప్పల్ ఆర్వోబీ ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయించాలనే సోయి ఎందుకు లేదన్నారు. ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలిచిన ఈటల.. రెండేైళ్లెనా తట్టెడు మైట్టెనా తీశావా..? అని ప్రశ్నించారు. హుజూరాబాద్లో ఏం చేయనోడు.. గజ్వేల్లో ఏం చేస్తాడో చెప్పాలన్నారు. ఇంట్ల గెల్వలేనోడు.. బయటెట్లా గెలుస్తాడో.. ఆయనకే తెల్వాలన్నారు. హుజూరాబాద్లో జీ హుజూర్ రాజకీయాలు నడిచే రోజుల దగ్గర పడ్డాయన్నారు.
ప్రజా ఆశీర్వాద ర్యాలీతో జమ్మికుంట పట్టణం కిక్కిరిసింది. ఎటు చూసినా తెలంగాణ చౌరస్తా రహదారులు జనంతో కిటకిటలాడాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి దాదాపుగా 30వేలకు పైగా జనం హాజరుకావడంతో హోరెత్తింది. ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు హెలీకాప్టర్లో నాయిని చెరువు వద్ద గల హెలీప్యాడ్లో దిగారు. ఆయనకు కౌశిక్రెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో చౌరస్తాకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు టంగుటూరి రాజ్కుమార్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరయ్యారు.