కరీంనగర్ నర్సింగ్ స్కూల్ అప్గ్రెడేషన్కు సంబంధించి ‘నర్సింగ్ కాలేజీపై నీలినీడలు’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ వీరారెడ్డి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి విషయం చెప్పడంతో ఏం జరిగిందంటూ ఆరా తీశారు. త్వరలోనే కరీంనగర్ వస్తానని, చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
కరీంనగర్ విద్యానగర్, జనవరి 19 : కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధం గా 2013-14లో అప్పటి ప్రభుత్వం నర్సింగ్ స్కూల్ను మంజూరు చేసింది. దీంతో కలిపి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నర్సింగ్ స్కూళ్ల సంఖ్య ఆరుకు చేరింది. అయితే కరీంనగర్ మినహా మిగతా ఐదింటిని కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడంపై గురువారం హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో సమావేశం జరిగింది.
నర్సింగ్ స్కూల్కు మంజూరైన 3.32 కోట్లకు సంబంధించిన వినియోగపత్రాన్ని ఇవ్వలేదన్న కారణంతో ఇక్కడి ప్రిన్సిపాల్కు మీటింగ్ సమాచారం ఇవ్వకుండా విస్మరించినట్టు తెలిసింది. ‘నమస్తే తెలంగాణ’ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘నర్సింగ్ కాలేజీపై నీలినీడలు’ శీర్షికన శుక్రవారం సమగ్ర కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ వీరారెడ్డి స్పందించారు.
నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ రమాబాయి నుంచి వివరాలు తీసకున్నారు. ఈ విషయాన్ని ఫోన్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లా రు. ఆ వెంటే హైదరాబాద్ వెళ్లి ఆయనను కలిసి, నర్సింగ్ స్కూల్ అప్గ్రేడ్, మెడికల్ కాలేజీ సమస్యలను ప్రస్తావించారు. త్వరలోనే కరీంనగర్కు వస్తానని, అక్కడ పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుందామని వారికి మంత్రి చెప్పారు. ఆమేరకు అమాత్యుడికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.