Minister KTR | రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రి శ్రీనివాస్గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ బైపాస్రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మానేరు బ్రిడ్జి వద్ద బోటు షికారును ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు బైపాస్రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ఏరియా దవాఖానకు చేరుకుని 40కేవీ రూప్టాప్ సోలార్ ప్లాంట్ను, 130 అదనపు బెడ్స్, క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరఫీ డేకేర్ సెంటర్ను ప్రారంభిస్తారు.
సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్రోడ్డులో నర్సింగ్ కళాశాల ఎదురుగా వేములవాడ, సిద్దిపేట ప్రధాన రహదారిపై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేశారు. దీని కోసం మున్సిపల్ శాఖ రూ.30 లక్షల నిధులు వెచ్చించించింది. పాపన్న పేరిట అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ జంక్షన్కు సుమారు రూ.కోటిన్నర ఖర్చు చేయనున్నారు. విగ్రహం చుట్టూ గార్డెన్, పౌంటేన్లతో సందర్శకులను ఆకట్టుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్మిక క్షేత్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందించేలా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే సీటీస్కాన్తో పాటు ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులకు ఉచిత డయాలసిస్ సేవలందిస్తున్నారు. మెరుగైన సేవలందుతున్న నేపథ్యంలో రోజురోజుకూ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. వారి సంఖ్యను బట్టి దవాఖానలో మరో 130 పడకలను అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రూ. రెండు కోట్లతో అదనపు పడకల గదులు, 40 కేవీ రూప్టాప్ సోలార్, క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరపీ డీకేర్ సెంటర్ను ప్రతేకంగా ఏర్పాటు చేశారు. ఏరియా దవాఖానను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి మెరుగైన వైద్యం అందించేలా కేటీఆర్ చేస్తున్న కృషిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సిరిసిల్ల పట్టణంలోని మానేరు వాగు, రామప్ప గుట్టల నుంచి మొదలు అయ్యప్ప ఆలయం వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి జరుగుతున్నది. వాగు ఒడ్డుకు కరకట్టల నిర్మాణం శరవేగంగా నడుస్తున్నది. ఎడమ వైపు కరకట్ట నిర్మాణం పూర్తి కాగా, కుడివైపు కరకట్ట నిర్మాణ పనులు చకాచకా సాగుతున్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎదురెక్కిన గోదావరి జలాలతో మానేరు జలశోభితం సంతరించుకున్నది. పర్యాటకులను ఆకట్టుకునేలా రూ.కోట్లతో పలు అభివృద్ధి పనులను టూరిజం శాఖ చేపట్టింది. అందులో భాగంగా బోటులో షికారు చేసేలా ఏర్పాటు చేశారు. శుక్రవారం రామప్ప గుట్టల వద్ద ఈ బోటును మంత్రులు ప్రారంభించనున్నారు.