సిరిసిల్ల/వేములవాడ/ఎల్లారెడ్డిపేట/తెలంగాణ చౌక్, నవంబర్ 6: తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ గల్లీల్లోని ప్రజలు డిసైడ్ చేయాలని కానీ, ఢిల్లీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్లో టికెట్ కావాలన్నా, బీఫాం కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా ఢిల్లీకి పోవాలని, ఎకే ఫె్లైట్ దిగే ఫె్లైట్ తప్ప వాళ్లు పీకేది ఏమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ల పరిస్థితి కూడా ఇంతేనని ఎద్దేవా చేశారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీద కూలీలుగా అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, విద్యార్థులు, యువకులను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు.
విద్యార్థి ఉద్యమ నాయకులను గౌరవించి చట్టసభలకు పంపిన ఘనత బీఆర్ఎస్దని ఉద్ఘాటించారు. వేములవాడలోని ఐబీపీ గ్యాస్ గోదాం మైదానంలో, , ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించగా, ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొమ్మిదిన్నరేండ్లలో కులం, మతం ప్రస్తావన లేకుండా ‘అభివృద్ధే నా కులం, సంక్షేమమే నా ధ్యేయం’ అంటూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగించారని కొనియాడారు. కాళేశ్వర జలాలతో గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ఎర్రటి ఎండలో మత్తడి దూకడమే నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పల్లె, పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో వేదికపైకి వచ్చిన టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ను సంబోధిస్తూ ఉద్యమ నాయకులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఉదహరించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ తరపున టికెట్ కేటాయించారని, దురదృష్టవశాత్తూ పరాజయం పొందినా శ్రీనివాస్కు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించారని గుర్తుచేశారు.
‘2009 ఉద్యమ కాలంలో నేను మీకు కేసీఆర్ కొడుకుగా మాత్రమే తెలుసు. కానీ నేడు నేనంటే ఏందో మీకు తెలుసు. మీరేందో నాకు తెలుసు. మీరు ఇచ్చిన అవకాశంతోనే 15 ఏండ్లుగా మీరు తలెత్తుకొని ఉండే విధంగా పని చేసి చూపిన. దేశంలో ఏ నగరానికి వెళ్లినా సిరిసిల్ల నాది. నేను అక్కడి ఎమ్మెల్యేనని గర్వంగా చెప్పకుంటా’ నాకు జన్మనిచ్చింది నా తల్లి కానీ, రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్లనే. మీ రుణం తీర్చుకుంటున్నా. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నా. మీ కండ్ల ముందే కనిపిస్తుంది. ఇంకా చేయాల్సింది కొంత మాత్రమే ఉంది. గ్రామాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే సిరిసిల్ల నంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టే బాధ్యత నాది. నాకు మీ అందరిపై విశ్వాసం ఉంది. యువకులు అంతా ఒక్కొక్కరు తమ వంతుగా వంద ఓట్లు వేయించాలి.’ అని అభ్యర్థించారు.
యువత కోసం ప్రతి జిల్లాలో స్కిల్డెవలప్మెంట్ సెంటర్( నైపుణ్య శిక్షణ కేంద్రం)ను ఏర్పాటు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం కచ్చితమైన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని, ఆ బాధ్యతను తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో దాదాపు 12 రాష్ర్టాల ప్రజలు కూలీ పనులు, వరినాట్లు, తదితర పనులతోఉపాధి పొందుతున్నారని, వచ్చే దఫాలో యువతతో మమేకమై వారికి నైపుణ్య శిక్షణ పెంపొందించే కార్యక్రమాలు చేపడతానన్నారు. ఐటీ మంత్రిగా ఉన్న తాను పరిశ్రమలను విస్తరించి స్వయం ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ఎన్నికల వేళ యువత ఆగం కాకుండా కొట్లాడి తెచ్చుకొని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కే ఓటు వేసేవిధంగా చూడాలని కోరారు.
మన తెలంగాణ సినిమా కథ బ్లాక్ బాస్టర్ అని మంత్రి కేటీఆర్ యువతను ఆకట్టుకునేలా ప్రసంగించారు. మన తెలంగాణ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అంతా మన కేసీఆరేనని కొనియాడారు. కేసిఆర్ సారథ్యం వహించిన తెలంగాణ స్టోరీ బ్లాక్బస్టర్ అయితే, కాంగ్రెస్ సినిమా కథకు కర్టాటక నేతలు స్క్రిన్ ప్లే, ఢిల్లీ నేతలు దర్శకత్వం, యూపీ నేతలు నిర్మాతలుగా తీస్తున్న కథ అట్టర్ప్లాప్ అయ్యేలా చేయాలని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సెంచరీ కొట్టాలని సూచించారు. ఆదివారం ప్రపంచ కప్ పోటీల్లో విరాట్ కోహ్లి సెంచరీ చేశాడని, డిసెంబర్ 3న సీఎం కేసీఆర్ సెంచరీ కొట్టాలని, హ్యట్రిక్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేలా దీవించాలని కోరా రు. కేసీఆర్కు తెలంగాణలోని నాలుగు కోట్ల మం ది ప్రజలు అంతా కుటుంబసభ్యులేనని, అలిగినా, గులిగినా మన వాళ్లకు మనపైనే ప్రేమ ఉంటుందన్నారు. మనోళ్లు గులుగుడు గులుగుడే కానీ, కారుపై గుద్దుడు గుద్డుడేనని చలోక్తి విసిరారు.
‘సిరిసిల్ల మీద నాకు ఏం ఫికర్ లేదు. ఇక్కడ నాపై పోటీకే ఢిల్లీలో మల్ల్లగుల్లాలు పడుతున్నారని’ మంత్రి కేటీఆర్ అన్నారు. మీ దయ ఉన్నంత కాలం సిరిసిల్ల గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. ‘మీపై సంపూర్ణ విశ్వాసంతోనే నేను రాష్ట్రమంతా ప్రచారం చేసుకుంటున్నా. ‘నన్ను కాపాడేది, గెలిపించేది మీరే. నా బలం.. బలగం. నన్ను నడిపించేది మీరే. మీకు సేవచేసే అవకాశం కల్పించాలని’ ప్రసంగాన్ని ముగించారు.
కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో ఒక మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారన్నారు. అంతేకాదు 200 గురుకుల పాఠశాలలను వెయ్యికి పెంచి, నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని కొనియాడారు.
కాంగ్రెస్ పనైపోయిందని, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమైపోతాయరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గెలుపు తమదేనని, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్లు తాము వంద సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వేములవాడ అభ్యర్థి, చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తన భుజాలపై వేసుకుంటానని, దత్తత తీసుకొని మరీ చేసి చూపిస్తానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గెలిపించకపోతే మాత్రం ఇకడికి రాను అని స్పష్టం చేశారు. మూడుసార్లు ఓడిపోయానని, ఒకసారి అవకాశం ఇవ్వాలని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టేవారిని నమ్మొద్దని, లొంగవద్దని చమతరించారు. కులపోడు అని, ఇంటిపక్కోడు అని వేసే ఓటు కూడుపెట్టదని, వృథాగా పోతుందని సూచించారు. మెజార్టీ విషయంలో సిరిసిల్లతో పోటీ పడాలని కోరారు. చల్మెడ లక్ష్మీ నర్సింహారావు నాలుగు పైసలు సంపాదించుకొని ఏనాడో జీవితంలో స్థిరపడ్డాడని, గుడినో, గుడిలో లింగాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఆయనకు లేదని స్పష్టం చేశారు. ‘మీరు వేసే ఓటు లక్ష్మీ నరసింహారావుకు కాదని, మీ తలరాతను మార్చుకునేందుకు అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ, ప్రస్తుతం సోనియా గాంధీ దాకా తెలంగాణకు జరిగిన అన్యాయం, ముఖ్యమంత్రి కేసీఆర్ సమయంలో జరిగిన అభివృద్ధిపై ఊర్లో చర్చ పెట్టాలని, మనసుతో ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేయాలని పిలుపునిచ్చారు.
దుబాయిలో వ్యాపారంలో స్థిరపడిన వేములవాడ చెందిన తోట రామ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. వేములవాడలో జరిగిన సమ్మేళనంలో తోటరామ్కు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్యక్రమాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఓయూ జేఏసీ చైర్మన్ మందాల భాసర్, పార్టీ సీనియర్ నాయకులు లోకబాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ లక్ష్మణ్రావు, యువ విద్యార్థి నాయకులు ఈర్లపల్లి రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మందా రాజేందర్, గుండె కార్ల నరేష్, జీవన్ గౌడ్, వనపట్ల సందీప్ రెడ్డి, పోతు అనిల్, జక్కుల నాగరాజు, గడ్డమీది శ్రీకాంత్రెడ్డి, సంతోష్గౌడ్, ప్రశాంత్, ఎడవోయిన రత్నాకర్, మహేశ్ ఉన్నారు.
నాటి తెలంగాణ పరిస్థితులు, రాష్ట్రం కోసం జరిగిన పోరాటం, ఆవిర్భావం తర్వాత తొమ్మిదిన్నరేండ్లలో ఎలా మారిందనే విషయాలను నేటి తరం యువకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల కలగా మిగిలిన ఎన్నో సమస్యలను పరిష్కరించాం. ఆనాడు రైతుల ఆత్మహత్యలు, ప్రశ్నించే యువకులను నక్సలైట్ల పేరిట చేసిన వేధించి కాల్చేసిన ఘటనలుండేవి. పల్లెల్లో బతకాలనే ఆశలు లేని పరిస్థితిని తెలంగాణ సమాజం అనుభవించింది. నీళ్లు లేక పశువులను అమ్ముకున్న రోజుల గురించి తెలుసుకోవాలి. యువత భవిష్యత్తు కోసమే సీఎం కేసీఆర్ 23 ఏండ్ల క్రితం ఎందరో మేధావులను కూడగట్టి, కలుపుకొని ఉద్యమం చేశారు. 13 ఏండ్లు కొట్లాడి రాష్ర్టాన్ని సాధించారు. తొమ్మిదిన్నరేండ్లలోనే అద్భుతంగా మార్చారు. తెచ్చుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపితే కాంగ్రెస్, బీజేపీలు కండ్లుమండించుకుంటున్నయి. జీర్ణించుకోలేక అసత్యప్రచారాలు చేస్తున్నరు. మీ అందరికీ ఒకటే చెబుతున్న. ఎవరి మాటలూ నమ్మద్దు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి మరోసారి బీఆర్ఎస్కు పట్టంగట్టేలా యువత నడుంబిగించాలి. మిగతా రాజకీయ నాయకుల కొడుకుల్లాగా కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. 2006లో ఉద్యమంలోకి వచ్చి నాయకుడయ్యారు. ప్రజల్లో ఉన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు.
– బీ వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆత్మబలిదానాలను గుర్తించని రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజలనెట్లా పాలిస్తడు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీద కూలీలుగా చిత్రీకరించిన రేవంత్రెడ్డికి శ్రీకాంతాచారి, ఇషాంత్రెడ్డి, బగబగ మంటల్లో కాలి జై తెలంగాణ అని నినదించిన విద్యార్థుల త్యాగాల సాక్షిగా తెలంగాణ వచ్చిందనే విశయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేసులు మోసిన, త్యాగాలు చేసిన బిడ్డల మీదే ఆయనకు చిత్తశుద్ధి లేదు. మరి తెలంగాణ మీద ఎలా ఉంటుంది. నేను పదిహేనేండ్లు కాటగలిసినట్లు పోతే నా ఊరోనివి, నా ఇంటికెప్పుడత్తవ్ అని ఆహ్వానించినందుకు కేటీఆర్కు కృతజ్ఞతలు.
ఈ రోజు ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. యువకులను రెచ్చగొట్టి, ఉన్మాదం నింపి దానికి ఉద్యమం పేరు పెడుతున్నాయి. నేను ఐదోతరగతి చదివే రోజుల్లో మానేరు ఎప్పుడో ఐదేండ్లకొకసారి నిండినప్పుడు టూర్ పోయేవాళ్లమని, ఇప్పుడు నిండుకుండలా మార్చి శాశ్వతమైన టూరిస్టు స్పాట్గా దాన్ని మార్చిన ఘనత బీఆర్ఎస్దే. తెలంగాణ రాకముందు రైతుల బాధలపై రాసిన పాటలు ఈ రోజు తారుమారయ్యాయి. బీడుభూములు, పచ్చని పొలాలుగా మారిపోయాయి. ఉద్యమకారులకు బీఆర్ఎస్ మంచి అవకాశాలిచ్చి గౌరవిస్తే, రేవంత్రెడ్డి మాత్రం అడ్డకూలీలుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. రేవంత్కు మా సత్తా ఏంటో త్వరలోనే చూపిస్తాం. తెలంగాణ మళ్లీ ఢిల్లీ నాయకుల చేతుల్లోకి పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం యువకులపై ఉంది. మరో మారు తెలంగాణ ఉద్యమంలా ఓట్ల ఉద్యమం చేసి అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరుతున్నా. కంటి రెప్పగా కాపాడుకునే నాయకుడిని లక్ష మెజార్టీతో గెలిపించుకోవాలి. ప్రతిపక్షాలు మాటలు నమ్మి ఆగం కావద్దు. ఆలోచించాలి. ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి.
– దరువు ఎల్లన్న, తెలంగాణ ఉద్యమ నేత
కాంగ్రెస్ను నమ్మి 60 ఏండ్లు మోసపోయాం. తెలంగాణను నిండా ముంచారు. ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నరు. ఏండ్ల కొద్ది అధికారంలో ఉన్నప్పుడు చేయనోళ్లు ఇప్పుడు చేస్తరా..? యువత ఆలోచించాలి. మరోసారి నమ్మితే మోసపోతం. గోసపడుతం. బీఆర్ఎస్ సర్కారే మనకు శ్రీరామ రక్ష. తొమ్మిదిన్నరేండ్లలోనే తెలంగాణను అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపింది. ఒకనాడు రాష్ట్రంలో 200 మాత్రమే ఉన్న గురుకులాలను 1000కి పెంచి పేదల కు నాణ్యమైన విద్యను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. యూత్ ఐకాన్గా ఉన్న మంత్రి కేటీఆర్ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సాధించడమే కాకుండా అనేక కంపెనీలను హైదరాబాదుకు తీసుకువచ్చి లక్షలాదిమందికి ఉపాధి కల్పించడం చాలా గొప్ప విషయం. వేములవాడ ప్రాంతంలోనూ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసి మ ధ్య మానేరు నిర్వాసిత యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తా. నియోజకవర్గంలో డ్రామాలు చేసే నాయకులు ఎకువయ్యారు. త్వరలోనే వారికి గుండెపోటు వచ్చింది దవాఖానలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకసారి అవకాశం ఇవ్వండి. మరింత అభివృద్ధి చేసి చూపిస్తా.
-వేములవాడ యువ ఆత్మీయసమ్మేళనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు