‘ఆదివాసీ గిరిజనులకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేశాం. మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసినం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం. 31 వేల మంది గిరిజనులను ప్రజాప్రతినిధులు చేసి పాలనలో భాగస్వాముల్ని చేశాం. ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. సమైక్య రాష్ట్రంలో ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను స్వరాష్ట్రంలో 10 శాతానికి పెంచాం. ఇంకా పోడు భూములు, లావనీ భూములకు సంబంధించి విస్తృత అధ్యయనం చేసి అర్హులందరికీ పట్టాలు అందిస్తం’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండలంలో విస్తృతంగా పర్యటించి, ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదరికమే కొలమానంగా తీసుకొని అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపిస్తూ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని కొనియాడారు. ఇవాళ్ల దేశంలోని ఆదర్శ గ్రామాల్లో ఎక్కువ శాతం మన తెలంగాణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఎనిమిదేండ్లలోనే ఇంతలా అభివృద్ధి పనులు చేస్తే మరి రాష్ర్టాన్ని 67 ఏండ్లు పాలించిన గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని, ప్రస్తుత బీజేపీ సైతం ఏం ఒరగబెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
– సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట/తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట/తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17 : ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని, మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించారు. రాజన్నపేట, బాకుర్పల్లితండాల్లో ఏర్పాటు చేసిన వేదికలపై అమాత్యుడు ప్రసంగించారు. తెలంగాణలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి దాదాపు 31 వేల మందికి గిరిజనులను ప్రజాప్రతినిధులు చేసి పాలనలో భాగస్వాముల్ని చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను స్వరాష్ట్రంలో 10 శాతానికి పెంచామని వెల్లడించారు. పోడు భూములు, లావని భూములకు సంబంధించి విస్తృత స్థాయిలో అధ్యయనం చేసి అర్హులందరికీ పట్టాలు అందిస్తామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో గిరిజన భవన నిర్మాణానికి రెండెకరాల స్థలం కేటాయిస్తామని, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో త్వరలోనే భూమిపూజ చేయిస్తామని తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు కేటాయిస్తామన్నారు. రాజన్నపేటకు 38 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైనా స్థలం లేకపోవడంతో నిర్మించలేదని చెప్పారు. గతంలో తానే స్వయంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 33 గుంటల స్థలం కొనుగోలు చేసి ఇచ్చినా ఇంతవరకు ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు వెంటనే నిర్మించాలని, అర్హులందరికీ అందించాలని సూచించారు.
మరికొంత మంది అర్హులు ఉంటే వారికి గృహలక్ష్మీ పథకంలో ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో కుట్టు శిక్షణ పొందిన గ్రామ మహిళల విజ్ఞప్తి మేరకు వారంరోజుల్లోపే 90 కుట్టు మిషన్లు అందిస్తానని ప్రకటించారు. నాటి ఉమ్మడి పాలనలో కరెంటు ఉంటే వార్త అని నేడు కరంటు లేకుంటే వార్త అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా వంటి పథకం దేశంలో మరెక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. తెలంగాణలోని బీడీ కార్మికులు అడగకున్నా వారికి పింఛన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మనసున్న నాయకుడు కావడం వల్లే పేదరికమే గీటురాయిగా తీసుకొని అన్ని రకాల పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాజన్నపేట గ్రామాభివృద్ధి కోసం 20.38 కోట్లు అభివృద్ధి పనులు చేశామని బాకురుపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో 2 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తున్నదని చెప్పారు. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో ఎక్కవ శాతం తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. కేంద్రం ప్రకటించిన 46 ఉత్తమ పంచాయతీల్లో 14 మన తెలంగాణలోనివేనని స్పష్టం చేశారు. బాకురుపల్లి తండావాసులు బోరు నీటిని కాకుండా మిషన్భగీరథ నీటిని తాగాలని మంత్రి సూచించారు. మిషన్భగీరథ పనులు పూర్తయి నల్లా కనెక్షన్లు ఇంటింటికీ ఇచ్చినా నీటిని ఎందుకు తాగడం లేదని మంత్రి ప్రశ్నించారు. బోరు నీటిలో ఫ్లోరైడ్ ఉంటుందని, మిషన్భగీరథ నీరు శుద్ధ జలమని ప్రజలకు అవగాహన కల్పించారు.
గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు
ఈ ఎనిమిదేండ్లలోనే సీఎం కేసీఆర్ ఇంతలా అభివృద్ధి పనులను చేస్తే రాష్ర్టాన్ని 67 ఏండ్లుగా పాలించిన గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సమర్థవంతమైన నాయకుడు కావడం వల్లే పేదరికమే కొలమానంగా తీసుకొని అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా నడిపిస్తూ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని కొనియాడారు. ‘ఒక శాసన సభ్యుడిగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నేను చేసిన అభివృద్ధి పనులను చెబుతాను? బీజేపీ నా యకులు గ్రామాల్లో చేసిన అబివృద్ధి పనులు చెబుతారా..? అని ప్రశ్నించారు. నాపై పోటీ చేసే అభ్యర్థులు తాము ప్రజలకు, గ్రామాలకు చేసిన మంచి పనులు ఏంటో తెలుపాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు చెప్పకుండా కేవలం సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఎన్ని నిధు లు తెచ్చారో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి తాను పాటుడుతున్నానని, తనకు పరీక్ష (ఎన్నికలు) వచ్చినపుడు అండగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు.
దత్తత గ్రామం అభివృద్ధి పథం
తన దత్తత గ్రామం రాజన్నపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని మంత్రి కేటీఆర్ వివరించారు. గ్రామంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేటి వరకు దాదాపు 20 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. గొల్లపల్లి నుంచి రాజన్నపేట మీదుగా అల్మాస్పూర్ దాకా 13 కోట్లతో రహదారి మంజూరు చేశానని, రాజన్నపేట నుంచి రాజన్నపేట తండాకు 2.05 కోట్లతో తారు రోడ్డు మంజూరు చేశానని వెల్లడించారు. గ్రామంలో మురుగు కాలువ నిర్మాణానికి 2.80 కోట్లు కేటాయించానని 33 లక్షలతో కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. 1.02 లక్షలతో విద్యుత్ స్తంభాలను, 4లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకున్నామని, ఎస్సీ మాల సంఘ భవనానికి 4.60లక్షలు మంజూరు చేశామని, 9లక్షలతో మహిళా సంఘం, 8.60 లక్షలతో రెడ్డి సంఘం, 4.60లక్షలతో యాదవసంఘం, 5లక్షలతో చైతన్య యూత్ సంఘ భవనాలు నిర్మించుకున్నామని వివరించారు.
13లక్షలతో మంచినీటి సరాఫరా పనులు చేసుకున్నామని, వీటితోపాటు రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు అందిస్తున్నామని వెల్లడించారు. గ్రామంలో మంజూరై పెండింగ్లో ఉన్న పనులను వెంటనే చేపట్టాలని సర్పంచ్ శంకర్కు మంత్రి సూచించారు. దత్తత గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీచైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మన్రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.