సిరిసిల్ల/ సిరిసిల్ల రూరల్, నవంబర్ 15: ‘తొమ్మిదిన్నరేండ్లుగా మీరు తలెత్తుకునేలా పనులు చేశాను. మీరిచ్చిన ఈ గౌరవంతోనే నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిం ది. మీరంతా ఆశీర్వదిస్తే.. మరింత అభివృద్ధి చేసి సిరిసిల్లను దేశంలోనే నంబర్వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుత’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాయంత్రం రాత్రి 7 గంటలకు నిర్వహించిన రోడ్షోలో ప్రసంగించారు. కాగా మంత్రి కేటీఆర్కు తంగళ్లపల్లి ప్రజలు బతుకమ్మలు, బోనాలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పదిహేనేండ్లుగా బీ బిడ్డగా ఆశీర్వదించడంతోనే ఎమ్మెల్యే అయ్యానని, కేసీఆర్ దయతో మంత్రిని అయ్యాయని అన్నారు. మంత్రిగా తన వంతు శాయశక్తుల అభివృద్ధికి కృషి చేశానని, సిరిసిల్ల అంటేనే గౌరవం పెంచానని పేర్కొన్నారు. మంత్రితో పాటు పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడంతో రాష్ట్రం అంతా తిరుగాల్సి ఉందన్నారు. కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేసుకోవడానికి ఇతర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని తెలిపారు. మీరంతా పెద్ద మనస్సుతో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.
కార్యకర్తలు నెలవిడిచి సాము చేయరాదని, ఎవరి గ్రామంలో వారు ఉంటూ ఇంటింటా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతీ ఒక్క నాయకుడు తానే కేటీఆర్ అనుకొని రానున్న రోజులు కష్టపడి పనిచేసి, ఈనెల 30న కారు గుర్తుకు ఓటు వేయించాలని కోరారు. తొమ్మిదిన్నర ఏండ్లలో సిరిసిల్ల ఎట్లా మారిందో అభివృద్ధి మీ కండ్ల ముందు ఉందన్నారు. సిరిసిల్ల-తంగళ్లపల్లి వంతెన కింద నీరు నిలువ ఉన్న జల దృశ్యం కన్పిస్తుందని గుర్తు చేశారు. నేను ఎక్కడికి పోయినా సిరిసిల్ల ఎమ్మెల్యేగానే నాకు గుర్తింపు అని చెప్పారు. సిరిసిల్లను ఎడ్యూకేషన్ హబ్గా తీర్చిదిద్దామన్నారు. మెడికల్, నర్సింగ్, అగ్రి కల్చర్ పాల్టెక్నిక్ కళాశాల, జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల వస్తాయి అనుకున్నామా? అని అన్నారు. సిద్దిపేట వరకు రైలు వచ్చిందని, త్వరలో తంగళ్లపల్లి వరకు వస్తుందని తెలిపారు. ఈ ప్రాంత యువకులకు ఉపాధి కోసం అపెరల్ పార్క్ను ఏర్పాటు చేశామని, డిసెంబర్ 3 తర్వాత చీర్లవంచ, చింతల్ఠాణలోని దాదాపు ఐదు వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. మూడు గంటలు కరెంట్ను నమ్మి మోసాపోదామా? అన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం కల్పించామని, వారు ఏమీ వెలుగబెట్టారని ప్రశ్నించారు. ఆ పార్టీకి అవకాశం ఇస్తే అది భస్మాసుర హస్తమేనని తెలిపారు. ప్రధాని మోదీ గ్యాస్ సిలిండర్ను 800కు పెంచాడని తెలిపారు. సీఎం కేసీఆర్ను గెలిపిస్తే 400కే సిలిండర్ ఇచ్చి మిగితా 400 కేసీఆర్ భరిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్ల కోసం పగటి వేషాగాళ్లల వస్తున్నారని, వారిని నమ్మవద్దని అభ్యర్థించారు. ప్రతిపక్షాల నేతలు చెప్పే మాటలను విని మోసపోవద్దని, మోసపోతే గోసపడతామని హెచ్చరించారు. బుధవారం జరిగిన క్రికెట్ మ్యాచ్లో విరాట్ కోహ్లి సెంచరీ కొట్టాడని, బీఆర్ఎస్ కూడా రానున్న ఎన్నికల్లో సెంచరీ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గడపను తట్టాలని, ప్రతి ఓటరును కలువాలని ఉందని, కానీ రాష్ట్రంలోని బాధ్యతలతో రాలేకపోతున్నానని వాపోయారు.
తనను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదేనని తెలిపారు. రోడ్ షోలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తొట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఏఎంసీ చైర్పర్సన్ పూసపల్లి సరస్వతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సర్పంచు అంకారపు అనిత, ఎంపీటీసీ కోడి అంతయ్య, ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి, పట్టణాధ్యక్షుడు బండి జగన్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, మండలాధ్యక్షుడు వేణుగోపాల్రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చెన్నమనేని వెంకటరావు, వైస్ ఎంపీపీ జంగిటి అంజయ్య, నాయకులు పుర్మాణి రామలింగారెడ్డి, పడిగెల రాజు, మోర నిర్మల, మోహన్రెడ్డి, మిరాల భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు.
కోనరావుపేట, నవంబర్ 15: మండల కేంద్రంలో మల్కపేట, నాగారం, ధర్మారం గ్రామాలకు చెందిన 80మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈమేరకు మల్కపేట గ్రామానికి చెందిన బీజేపీ ఓబీసీ జిల్లా కార్యదర్శి ఒగ్గు ప్రభాకర్తో పాటు పలువురికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.