కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/చొప్పదండి : దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఐదున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇచ్చారని, అప్పుడు ఆ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం చొప్పదండి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఒక్కచాన్స్ ఇవ్వండి అంటూ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి సూచించారు. 55 ఏండ్లు అధికారం ఇస్తే కరెంట్ ఇచ్చారా, సాగు నీళ్లు ఇచ్చారా, తాగు నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందిందో వివరించారు. ఇందులో రెండున్నరేండ్లు కరోనా వచ్చి రూ.లక్ష కోట్ల నష్టం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత నష్టాన్ని భరిస్తూ కూడా రాష్ర్టాన్ని అభివృద్ధి పరుస్తూనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అప్రజలకు అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులు ఒక్కటైనా చేసిందా? అని, ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ మరిన్ని కొత్త పథకాలు ప్రవేశ పెడుతారని తెలిపారు. అందులో ఆడబిడ్డల కోసం సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.3 వేలు అందిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని నమ్మి ఓటేస్తే 2014లో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ను ఇప్పుడు రూ.1,200 చేశారని మండిపడ్డారు.
వచ్చే తమ ప్రభుత్వంలో రూ.800 భరించి రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. జనవరిలో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని, రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి మంచి పనులు చేసుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని సూచించారు. దున్నపోతుకు గడ్డివేసి ఆవు పాలు పితికినట్లు.. పని చేయని వాళ్లకు ఓట్లు వేసి పని చేసే వాళ్లను విస్మరించవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంటే ఇస్తామని అంటున్నారని, కర్ణాటకలో వీళ్ల మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయవద్దని చెప్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి, 24 గంటల కరెంట్ ఇస్తే రాష్ట్ర రైతులు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని స్పష్టం చేశారు. మరిప్పుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి కరెంట్ ఎక్కడిస్తున్నారో కనిపించడం లేదని అంటున్నారని, ఒక ఏసీ బస్సు పెట్టి బిర్యాని కూడా ఇచ్చి వాళ్లను హైదరాబాద్ నుంచి చొప్పదండి వరకు తీసుకువస్తామని, ఇక్కడ వాళ్లు కోరుకున్న ఏ మండలానికైనా ఏ గ్రామానికైనా తీసుకెళ్తామని, తీగలు ముట్టుకుంటే కరెంట్ వస్తున్నదో వస్తలేదో తెలుస్తుందని, వాళ్ల పీడ కూడా పోతుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నాడు ఇన్వర్టర్లు, జనరేటర్లు పెట్టుకునేదని, ఇప్పుడు అవి కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. కాలిపోయే మోటర్లు రాక వైండింగ్ దుకాణాలు కూడా మూతపడ్డాయని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే ఇవన్నీ మళ్లీ మన కండ్ల ముందు కనిపిస్తాయని చెప్పారు. అందుకే కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అనేది మీరే తేల్చుకోవాలని ప్రజలనుద్దేశించి సూచించారు.
కాంగ్రెస్కు ఓటేసి తమ రాష్ర్టాన్ని చీకటి చేసుకున్న కర్ణాటక రైతులు ఇప్పుడు చెంపలేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఎన్నికల్లో ఏం చేస్తారో చెప్పుకోవాలి తప్ప కేసీఆర్ను, ఇక్కడ ఎమ్మెల్యే రవిశంకర్ను ఇష్టమున్నట్లు తిడుతున్నారని, తిడితే ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఎండాకాలం వస్తే నాయకులు గ్రామాల్లోకి వెళ్లేందుకు భయపడే వారని, మంచి నీళ్ల కోసం మహిళలు ఎక్కడ నిలదీస్తారోనని ఆందోళన చెందే వారని, ఇప్పుడు ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చి మహిళల ఇబ్బందులు తీర్చుతున్నామని తెలిపారు. సాగు నీళ్లకు కూడా రైతులు ఎంతో గోస పడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఎండకాలం కూడా చెరువులు మత్తడి దుంకుతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఇక్కడ ఒక అభ్యర్థి ఏడుస్తున్నడని సానుభూతి చూపవద్దని, బీజేపీ నుంచి మా శోభక్క నిలబడిందని, ఆమెకు లొల్లి ఎక్కువ, పని తక్కువ అని చెప్పారు. చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే, స్థానికుడైన సుంకె రవిశంకర్ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చొప్పదండి పట్టణానికి ఇప్పటికే రూ.120 కోట్లు ఇచ్చామని, పట్టణం అభివృద్ధి చెందాలన్నా, రైతులు మరింత బాగుపడాలన్నా బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఈసారి డబుల్ బెడ్రూం ఇండ్లు చాలా ఎక్కువ కట్టుకుందామని, ఈ ఇండ్లు రావాలంటే రవిశంకర్కు గెలిపించుకోవాలని సూచించారు.
చొప్పదండి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎందరో నాయకులు ఎమ్మెల్యేగా గెలిచి వెళ్ల్లారే తప్ప చొప్పదండిలో తట్టెడు మట్టి కూడా తీయలేదు. స్థానికంగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక అభివృద్ధి పనులు చేశా. చొప్పదండిలో సెంట్రల్లైటింగ్ ఏర్పాటు చేశాం. ప్రతి వార్డులో సీసీరోడ్లు, మురికికాలువలు నిర్మించాం. మిషన్భగీరథ మంచినీటి సౌకర్యం కల్పించాం. ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయించాం. రూ.వంద కోట్లతో చొప్పదండిని అభివృద్ధి చేశా. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి శూన్యం.
అవినీతి తప్ప వారు చేసిందేమీ లేదు. స్వరాష్టంలో కేసీఆర్ సీఎం అయ్యాక తొమ్మిదేండ్లలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. రైతుబంధు పథకంతో అన్నదాతల బతుకుల్లో వెలుగులు నింపాం. ప్రజలారా ఆలోచించండి. తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెసోళ్లకు కడుపు మండుతున్నది. కాషాయపోళ్లకు కండ్లు మండుతున్నాయి. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి అభివృద్ధి చేసేటోన్ని, అందుబాటులో ఉండేటోన్ని మరోసారి దీవించండి.
-చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్