కోరుట్ల నియోజక వర్గంలో సొంతింటి కల సాకారం
మెట్పల్లి, కోరుట్లలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలు
లబ్ధిదారులను ఆప్యాయంగా పలుకరించిన అమాత్యుడు
ఆనందంలో కుటుంబాలు
పేద, మధ్య తరగతి ప్రజల కల సాకారమైంది. కోరుట్ల నియోజకవర్గంలో రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు వచ్చింది. మంత్రి కేటీఆర్ గృహప్రవేశాలు చేయించగా, లబ్ధిదారుల్లో ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.
కోరుట్ల/ మారుతీనగర్, జూన్ 10: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేశారు. రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవితో శుక్రవారం కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు. మెట్పల్లి పట్టణంలోని వెంకట్రావుపేట అర్బన్ కాలనీలో 110 డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద.. కోరుట్ల పట్టణ శివారులోని పీవీ నర్సింహారావు పశు వైద్య కళాశాల సమీపంలో 80 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఆయాచోట్ల మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులతో కలిసి ప్రారంభోత్సవాలు చేయించారు. అనంతరం లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న పింఛన్ వస్తుందా? అని ఆరా తీశారు. దివ్యాంగుడైన అబ్దుల్ అజీజ్ను పలుకరించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం కేసీఆర్ ఎల్లవేళలా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. సొంతిల్లు రావడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. తమ కల నెరవేరిందని సంబురపడ్డారు. మహిళలు, చిన్నారులు మంత్రితో సెల్ఫీ తీసుకున్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్, ఆర్డీవో వినోద్కుమార్, మెట్పల్లి, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్లు రాణవేని సుజాత, అన్నం లావణ్య తదితరులు పాల్గొన్నారు.
కోరుట్లలో డబుల్ బెడ్రూం ఇంటిని ప్రారంభిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పక్కన మంత్రి కేటీఆర్, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య
అవ్వా.. సంతోషమేనా..
మెట్పల్లిలో డబుల్ బెడ్రూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమాత్యుడు రామన్న దివ్యాంగురాలైన లబ్ధిదారు బేతం బక్కవ్వను ఆత్మీయంగా పలుకరించారు. అవ్వా.. ఇల్లు మంచిగున్నదా.. సంతోషమేనా..! అని అడిగారు. కేసీఆర్ పుణ్యానా కిరాయి తిప్పలు తప్పాయని, ఇల్లు బాగున్నదని, సౌలతులు మంచిగున్నాయని మురిపెంగా చెప్పింది. కలలోగూడా సొంతింటిలో ఉంటామని అనుకోలేదని ఆనందం వ్యక్తం చేసింది.
పింఛన్ పైసలతోనే బతుకుతున్నం
నాకు కళ్లు కనిపించవు. సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్పైనే కుటుంబాన్ని వెళ్లదీస్తున్న. కిరాయి ఇంట్ల ఉంటూ చాలా కష్టాలు పడ్డం. నా భార్య కూడా చిన్నాచితక పనులు చేసేది. కలలో మేం ఇల్లు కట్టుకుంటం అనుకోలె. కానీ, కేసీఆర్ సారు దయతో నాకు ఇల్లచ్చింది. సొంతింటిని చూసి నా భార్యా పిల్లల ఆనందానికి అవధులు లేవు. మా కష్టాలను దూరం చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు ఎప్పటికీ రుణపడి ఉంటం.
–అబ్దుల్ అజీజ్, లబ్ధిదారురాలు (కోరుట్ల)
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం
అద్దె ఇంట్ల ఉంటూ మస్తు కష్టాలు పడ్డం. సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని నాకు సొంతిల్లు అచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్లు సర్కారోళ్లు ఇస్తున్నరని తెలిసి దరఖాస్తు చేసుకున్న. పైసా ఖర్చు లేకుండా ఇళ్లు మంజూరైంది. నిత్యం బండలు కొట్టి బతుకులు ఎల్లదీస్తున్న మాలాంటి వారికి ఇల్లు వస్తుందని కలలో గూడ అనుకోలె. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు రుణపడి ఉంట.
– ఓర్సు భీమవ్వ, లబ్ధిదారురాలు (కోరుట్ల)
కలలో కూడ అనుకోలె..
రెక్కాడితే గాని డొక్కాడని మాకు సొంత ఇళ్లు వస్తుందని కలలో గూడ అనుకోలె. బీడీలు చుట్టగా వచ్చిన పైసలతో కుటుంబాన్ని వెళ్ల దీస్తున్న. అద్దె ఇంట్ల పాణం మంచిగ లేని భర్త, బుద్ది మాంద్యం కలిగిన కొడుకుతో చాల కష్టాలు అనుభవించా. సీఎం కేసీఆర్ సార్ రూపంలో ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు. డబుల్ ఇళ్లు అందించిన సీఎం, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకు జీవితాంతం రుణపడి ఉంటం.
– చింత పంచాక్షరి, లబ్ధిదారురాలు (కోరుట్ల)