బాధితులకు మంత్రి కొప్పుల బాసట
నందిమేడారం వరద ప్రాంతాల్లో పర్యటన
ప్రభుత్వపరంగా రూ.5200, వ్యక్తిగతంగా రూ.5 వేల చొప్పున రూ.2.25 లక్షల తక్షణ సాయం
ధర్మారం, జూలై 14: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల వర్ష బాధితులకు అండగా నిలిచారు. నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. పెద్దపల్లి ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ కట్ట కింద లోతట్టు ప్రాంతంలో గంగపుత్రులు, ముదిరాజ్లకు చెందిన 45 ఇండ్లు వరదనీటిలో మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న అమాత్యుడు గురువారం తెప్పపై వెళ్లి ఇండ్లను పరిశీలించారు. బురదలోనే నిలబడి నిరాశ్రయులతో మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.ప్రభుత్వపరంగా రూ.5200, వ్యక్తిగతంగా రూ.5000 తక్షణ సహాయాన్ని ప్రకటించారు. శుక్రవారం అందజేయాలని తహసీల్దార్ వెంకటలక్ష్మిని ఆదేశించారు.
కట్టకింద వరద కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి నిరాశ్రయులకు ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూలేనివిధంగా భారీ వర్షం పడడంతో ఆపార నష్టం వాటిల్లిందన్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వపరంగా సాయం చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాల మాటలను నమ్మి ఆగంకావద్దని సూచించారు. మునిగిపోయిన 45 ఇండ్లకు చెందిన బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వీరికి ఎస్సీకాలనీలో ఇండ్లు కట్టించేందుకు స్థలాన్ని గుర్తించగా వారు అంగీకరించలేదని గుర్తుచేశారు.