ధర్మపురి, సెప్టెంబర్28: ధర్మపురికి ప్రగతి పండుగ వచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో దూసుకెళ్తూ, ప్రజావసరాలకు తగ్గట్టు మార్పు చెందుతున్నది. కాగా, గురువారం ఒకే రోజు పట్టణంలో రూ.25కోట్ల పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపనలు చేయగా, పట్టణ ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.
ధర్మపురి పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామని, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి పట్టణంలో ఎస్డీఎఫ్ నిధులతో పెద్ద సంఖ్యలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పట్టణ ప్రగతిని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న ధర్మపురిని మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించినట్లు చెప్పారు.
ఇప్పటికే రూ.4కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మించామని, మురికి కూపంలా ఉన్న చింతామణి చెరువును రూ.1.30కోట్లతో సుందరీకరించినట్లు వివరించారు. పట్టణంలోని కూడళ్లన్నీ అభివృద్ధి చేశామన్నారు. ధర్మపురి పట్టణాన్ని గతంతో పోలిస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తున్నదన్నారు. నాలుగేళ్ల కిత్రం వచ్చిన భక్తులు ఇప్పుడు క్షేత్రానికి వస్తే ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, కమిషనర్ రమేశ్, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్ ఉన్నారు.