కోటేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
అభివృద్ధి, అంచనా వ్యయంపై అధికారులతో సమీక్ష
వెల్గటూర్, జూన్ 19: శాతవాహనుల తొలిరాజధానిగా ప్రసిద్ధిగాంచిన కోటిలింగాలకు కొంగొత్త సొబగులు అద్దుతామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. కోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఆదివారం కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆలయ అభివృద్ధి, అంచనా వ్యయంపై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా డీఈఈ రాజేశ్, ఆలయ ఈవో మారుతిరావు ఆలయం, ప్రాకార మండపం, 5 నక్షత్రాల రాజగోపురం, ఆలయ కార్యాలయ నిర్మాణంపై రూ. 4 కోట్లు అవసరమని మంత్రికి వివరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ చారిత్రకంగా ప్రఖ్యాతిగాంచిన కోటిలింగాలను రూ. 25 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. సమీపభవిష్యత్లో కోటేశ్వరస్వామి ఆలయానికి సేఫ్ట్టీవాల్ నిర్మాణం, ఆలయం చుట్టుపక్కల 40 ఎకరాల స్థలంలో కమాన్, పార్కు, కల్యాణ మండపం, గెస్ట్హౌస్, గోశాల, టాయిలెట్స్, దుకాణా సముదాయం తదితర సౌకర్యాలు కల్పించి గొప్ప పరక్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత దేవాదాయశాఖ అధికారులు మంత్రిని సన్మానించారు.