శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఎక్కువ ఉద్యోగాలు సాధించాలి
ధర్మపురిలో పోలీస్ ఉద్యోగార్థుల శిక్షణ తరగతుల ముగింపు
సమావేశంలో మంత్రి ఈశ్వర్
ధర్మపురి,జూన్ 30 : పట్టణంలో ‘ధర్మపురి ఈ క్లాస్ రూంపేరిట’ ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో కోచింగ్ తీసుకున్న పోలీసు ఉద్యోగార్థులు ఎక్కువ సంఖ్యలో కొలువులు సాధించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. నిత్యం శ్రద్ధతో రివిజన్ చేస్తే కొలువు సులువుగా సాధించవచ్చని చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖ , ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రూప్స్ , ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ధర్మపురిలో రెండు నెలల క్రితం ప్రారంభమై ఉచిత శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు సమావేశంలో మంత్రి ఈశ్వర్ పాల్గొని మాట్లాడారు. విజయవంతంగా కోచింగ్ ఇచ్చిన కరీంనగర్ కు చెందిన లక్ష్యం అకాడమీ ఫ్యాకల్టీని అభినందించారు. ఇక్కడ ఉద్యోగార్థులకు పూర్తి ఉచితంగా స్టడీ మెటీరియల్, యాప్ అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్ ఉచితంగా అందించామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారన్నారు. రికార్డు స్థాయి ఉద్యోగాలు ప్రకటించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా చేయడంతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు రికార్డు స్థాయిలో 91వేల కొలువులను నింపేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. వీటితో పాటు ఐటీ మంత్రి గా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ రూపు రేఖలు పూర్తిగా మారాయన్నారు. ఐటీలో హైదరాబాద్ నగరం బెంగళూర్తో పోటీ పడుతున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ కంపెనీల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగాల నియామకాలు జరిగాయన్నారు. అలాగే 91వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపుకోకుండా..ఉద్యోగార్థుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల స్టడీ సెంటర్లను కోచింగ్ సెంటర్లుగా మార్చి ఉచిత శిక్షణ అందించామన్నారు. అలాగే ధర్మపురి నియోజకవర్గంలో 1040 మందికి శిక్షణ ఇచ్చామని, గురువారం పోలీస్ శిక్షణ తరగతులు ముగిశాయన్నారు.
ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి స్నేహలత
ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదవాలని ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత పిలుపునిచ్చారు. ఎంచుకున్న లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ శ్రమించి గమ్యాన్ని చేరుకోవాలన్నారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడేలా ఒక పెద్ద లక్ష్యం పెట్టుకొని చదవాలన్నారు. పాజిటివ్ గా ఆలోచిస్తూ..ఇన్ని ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం నాదే అనే బలమైన అలోచనతో చదవాలన్నారు. నెగెటివ్ గా ఆలోచిస్తే ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయన్నారు. ఉద్యోగార్థుల కోసం ఎల్ఎమ్ కొప్పుల ఆర్గనైజేషన్ సేవలు నిరంతరం కొనసాగుతాయన్నారు. శిక్షణ పొందిన వారందరినీ పోలీస్ యూనిఫామ్లో చూడాలన్నదే తన కోరిక అన్నారు..
మైనారిటీ విద్యార్థులకు సన్మానం
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ధర్మపురి మైనారిటీ బాలికల గురుకుల విద్యాలయానికి చెందిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించగా వారిని ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈశ్వర్ గురువారం అభినందించి సన్మానించారు. మైనారిటీ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం హెచ్ఈసీ లో సీహెచ్ అక్షిత 486/500 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. అదేవిధంగా శంకరపల్లి మండలం గడ్డిపాక గ్రామానికి చెందిన జీ పావని సీఈసీలో 487/500 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ విద్యార్థులను అభినందించి శాలువాలతో సన్మానించారు. అధ్యాపకులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇక్కడ ప్రిన్సిపాల్ సంజీద భాను, కోఆర్డినేటర్ అయేషా జరీన్ ఉన్నారు.
సేవలకు సన్మానం
పోలీస్ శిక్షణ తరగతుల్లో తమ వంతుగా సేవలందించిన ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్కుమార్, ల క్ష్యం అకాడమీ డైరెక్టర్, ఫ్యాకల్టీ, వలంటీర్లుగా సేవలందించిన యువకులను సన్మానించారు. అనంతరం లక్ష్యం అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువత మంత్రి ఈశ్వర్-స్నేహలత దంపతులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు శిక్షణ పొందినవారు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు అయ్యోరి వేణు, వొడ్నాల ఉమాలక్ష్మి, తిర్మందాసు అశోక్, సయ్యద్ యూనస్, నాయకులు చిలివేరి శ్యాంసుందర్, ఆకుల రాజేశ్, శేఖర్, కరీంనగర్ లక్ష్యం అకాడమీ డైరెక్టర్ ఉమాప్రసాద్, ఉద్యోగార్థులు తదితరులున్నారు.