యువత కోసం 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రగతిని అడ్డుకుంటున్న కేంద్రం
దేశానికే ఆదర్శంగా కేసీఆర్ పాలన
కోరుకంటి ఈ-స్టడీ సర్కిల్ యాప్ సద్వినియోగం చేసుకోండి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
గోదావరిఖని, జూలై 11: ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు 91వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేశారని, పట్టుదలతో శ్రమించి ఉద్యోగాలను సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. దేశ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటున్నదని, ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క మంచి పని కేంద్రం చేయలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిలుస్తుందన్నారు. సోమవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుకంటి ఈ-స్టడీ సర్కిల్ యాప్ను మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలపాలన్న సంకల్పంతో రాష్ట్రంలో ప్రతి విద్యార్థి పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఏటా ఒక్కో విద్యార్థిపై రూ. 1,25,000ను ఖర్చు చేస్తుందన్నారు. కోరుకంటి ఈ-స్టడీ సర్కిల్ యాప్ను ఏర్పాటు చేయ డం అభినందనీయమని, యాప్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా చూడాలన్నదే తన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 400 మంది యువతకు 60 రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ ఉచితంగా శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. వారిలోని ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు కోరుకంటి ఈ-స్టడీ సర్కిల్ యాప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం సాధించాలనే తపన ఉంటే చాలదనీ, అందుకు తగిన విధంగా శ్రమించాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ అనిల్కుమార్, జడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు అడ్డాల స్వరూ పా రామస్వామి, బాల రాజ్కుమార్, నాయకులు పీటీ స్వామి, చెల్కలపల్లి శ్రీనివాస్, దేవరాజ్, నూతి తిరుపతి, మండ రమేశ్, సమ్మారావు తదితరులు ఉన్నారు.