విద్యానగర్, మార్చి 8: మానవుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారడంతో చిన్న వయస్సులోనే సడెన్ కార్డియాక్ అరెస్ట్లు పెరిగాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. గుండెపోటుకు గురయ్యే బాధితులకు తక్షణమే సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిసటిటేషన్) చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. సీపీఆర్ గురించి ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
బుధవారం కరీంనగర్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో మంత్రి గంగుల కమలాకర్ సౌజన్యంతో నిర్వహించనున్న కార్డియాక్ హెల్త్ స్రీనింగ్, మీ గుండె పదిలం కార్యక్రమానికి మంత్రి హరీశ్రావు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా తరువాత ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. కార్డియాక్ అరెస్ట్, హర్ట్ అటాక్ లాంటి హృద్రోగ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. మనతోనే ఉన్నవారు ఉన్నట్టుండి కుప్పకూలే వారి ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్కు ఫోన్ చేయడమే కాకుండా సీపీఆర్ చేయాలని సూచించారు. ఛాతిపై భాగంలో నొకడం, నోటి ద్వారా శ్వాసను అందించాలన్నారు.
ఒకప్పుడు వయస్సుపైబడిన వారికి మాత్రమే హృద్రోగ సమస్యలు వచ్చేవని, ఇప్పుడు 18 ఏండ్ల పిల్లలు కూడా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు జిల్లాలోని విద్యార్థులకు ఎదురుకాకుండా కళాశాలస్థాయి 18 సంవత్సరాల వయస్సు నుంచి 40 ఏండ్ల వయస్సు గల విద్యార్థులకు ఐఎంఏ సహకారంతో ఉచితంగా హర్ట్ స్రీనింగ్, ఈసీజీ, 2డీ ఎకో వంటి గుండె పరీక్షలు చేయించి ఉచితంగా మందులను ఇవ్వాలని నిర్ణయించిన మంత్రి గంగుల కమలాకర్ను అభినందించారు. ఈ తరహ కార్యక్రమం దేశంలోనే ప్రప్రథమమని కొనియాడారు.
కళాశాలల్లో యోగా, ప్రాణాయామానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. తద్వారా పిల్లలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో తరగతులను నిర్వహిసున్నామని తెలిపారు. వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరుచుకోవచ్చని పేర్కొన్నారు. కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక కంటివెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్డియాక్ అరెస్ట్తోనే నా అన్న మరణం
సాధారణంగా హర్ట్ఎటాక్ వస్తే శరీరం లో ఒకేవైపు లాగడం, ఛాతిభాగంలో తీవ్రమైన నొప్పి లాంటి కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తా. కానీ, సడెన్ కార్డియాక్ అరెస్ట్కు గురైన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపించవు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే మనిషి కుప్పకూలుతాడు. కొంతకాలం కిందట తన సోదరుడు వాకింగ్కు వెళ్లి సడెన్ కార్డియాక్ అరెస్ట్కు గురై చనిపోయాడు. మేం ఖరీదైన వైద్యం చేయించుకునేస్థాయిలో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది.
ఈ మధ్య ఎందరో యువకులు ఆకస్మిక గుండెపోటుతో మరణించడం బాధాకరం. ఈ పరిస్థితుల్లోనే ఐఎంఏ సహకారంతో ‘గుండె పదిలం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో తొలుత హర్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తారు. అవసరం మేరకు ఈసీజీ, 2డీఎకో లాంటి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి మందులను ఉచితంగా అందిస్తారు. మొదటి విడుత కళాశాల స్థాయి విద్యార్థులకు, ఆ తరువాత వాకింగ్ కేంద్రాలు, జనసమర్థ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో మిగతావారికి పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. ఇందుకు ప్రణాళికాబద్ధంగా ముందుసాగుతాం. – మంత్రి గంగుల కమలాకర్