కార్పొరేషన్, నవంబర్ 3: కరీంనగర్లో ఓ వైపు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 14, 15, 16వ డివిజన్లలో శుక్రవారం రాత్రి ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఆయా డివిజన్లలో పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు మంగళహారతులు, డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మంత్రి ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో నగరం ఎంత అభివృద్ధి చెందిందో ఆలోచన చేయాలన్నారు. రాష్ర్టానికి పట్టిన దారిద్య్రం కాంగ్రెస్, బీజేపీలు అన్నారు.
నగరంలో రాత్రిళ్లు వెలుగులు జిగేల్ మనేలా అభివృద్ధి చేశామన్నారు. తనను మరోసారి ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రతి ఏటా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పద్మనగర్లో వేంకటేశ్వర స్వామి, నగర శివారులో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో ముందుకు సాగుతుంటే మళ్లీ రాష్ట్రంలో దొంగలు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ముసుగులో కిరణ్కుమార్రెడ్డి, షర్మిల వచ్చి హైదరాబాద్లో ఉన్నారని విమర్శించారు.
తెలంగాణ సంపదపై కన్నేసి కేసీఆర్ ఓడిపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపి సంపదను దోచుకుపోవడానికి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ దొంగల చేతుల్లో పెట్టవద్దన్నారు. విలువైన ఓటు విషయంలో తప్పు చేస్తే మన బిడ్డల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. మీ కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కొత్తగా పోటీకి వచ్చేవాళ్లు కేవలం తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకే వస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు శ్రీకాంత్, మహేశ్, నాయకులు కట్ట సత్తయ్య, రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.