కార్పొరేషన్, మే 30: కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ పనులు, మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ శివారు మానేరు నదిపై చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి పనులను మంగళవారం మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 17న కేబుల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఫౌంటెయిన్ పనులు సాగుతున్నాయన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ మొదటి విడుతను ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, ప్రాజెక్టు పూర్తయితే నగరానికి కొత్త శోభ వస్తుందని చెప్పారు. ఇక్కడ కో ఆప్షన్ సభ్యుడు అంజాద్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.