కరీంనగర్ : తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్ పట్టణంలోని 44, 45, 26వ డివిజన్ పరిధిలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS) తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని , గులాబీ జెండానే నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు.
బీజేపీ నాయకులు దేవుడుని రాజకీయాలకోసం వాడుకుంటారని, ప్రత్యర్థి బండి సంజయ్ కంటే ఎక్కువగా పెద్ద హిందువును తానేని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. స్వార్థపూరిత నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు (Drinking water) అందించిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) దేనన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
రైతులకు పెట్టుబడి సాయం, మద్దతు ధర, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం పండుగలా మారిందన్నారు. నాడు కరెంట్ కోసం రోడ్లెక్కితే ప్రస్తుతం 24గంటల కరెంట్తో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు మెండి శ్రీలత చంద్రశేఖర్, పిట్టల వినోద శ్రీనివాస్, నక్క పద్మ క్రిష్ణ , నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్, అక్బర్ హుస్సేన్,చెల్లోజి హరికృష్ణ , ఉదరాపు మారుతీ పబ్బతి శ్రీనివాస్ రెడ్డి బైరం పద్మయ్య చీగిరి శోభ, బోయినిపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు .