కార్పొరేషన్, నవంబర్ 28 : తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే రక్షకుడుగా నిలుస్తాడని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోదీ రక్షకుడుగా ఉంటారా?.. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రక్షకుడిగా నిలుస్తాడా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం నగరంలో భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా టవర్సర్కిల్ వద్ద జరిగిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. తనకు మద్దతుగా తరలివచ్చిన ప్రజానీకానికి కృతజ్ఞతలు చెబుతూనే నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యారు.
40 ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని తాను చేసి చూపించానన్నారు. కరీంనగర్కు ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులను సీఎం కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. కరీంనగర్లో ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అయిన మానేరు రివర్ ఫ్రంట్ను తీసుకువచ్చానని, దానిని తానే పూర్తి చేస్తానన్నారు. అలాగే మెడికల్ కళాశాల, వేంకటేశ్వర దేవాలయం, ఇస్కాన్ టెంపుల్ను కూడా పూర్తి చేస్తానన్నారు. ఈ అభివృద్ధి పనుల్లో కాంగ్రెస్, బీజేపీ ఏం పాత్ర ఉందని ప్రశ్నించారు. వీరు శిఖండి పాత్ర తప్ప వారు చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నిలబెట్టిన అభ్యర్థే కాంగ్రెస్ అభ్యర్థి అని విమర్శించారు.
అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నాకా చౌరస్తా దాటి ప్రచారం చేయడం లేదన్నారు. కేవలం ముస్లిం ఓట్లను చీల్చేందుకు మాత్రమే బండి సంజయ్ కాంగ్రెస్ అభ్యర్థితో కుమ్ముక్కై కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని తేల్చిచెప్పారు. గతంలో రెండు సార్లు తనపై ఓడిపోయిన బండి సంజయ్ గత ఎంపీ ఎన్నికల్లో దవాఖానలో చేరి గెలిచాడని విమర్శించారు. గెలిచినప్పటి నుంచి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు.
తాను వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేస్తున్నానని, మరి బండి సంజయ్ స్మార్ట్సిటీ తీసుకువచ్చానని ప్రమాణం చేస్తావా? అని మంత్రి గంగుల సవాల్చేశారు. 2015లో అప్పటి ఎంపీ వినోద్కుమార్, తాను, కార్పొరేటర్లు ఢిల్లీకి పోయి స్మార్ట్సిటీ తీసుకువచ్చామని, అప్పుడు సంజయ్ కూడా కార్పొరేటర్ అని గుర్తు చేశారు. మరీ తాను ఎలా స్మార్ట్సిటీ తీసుకువచ్చానని చెప్పుకొంటారని ప్రశ్నించారు. అన్నీ దొంగ మాటలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
నాలుగున్నరేళ్లలో వేల కోట్లు సంపాదించిన సంజయ్ కావాలా?. లంచం తీసుకోని తాను కావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ఏం వ్యాపారాలు చేసి బండి సంజయ్ వేల కోట్లు సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయమే నీ వ్యాపారమా? అని ప్రశ్నించారు. తన కార్యకర్తల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. తాను ఏ రోజు కూడా లంచాలు, చందాలు తీసుకోలేదన్నారు. నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. తాము బ్రహ్మాండమైన మెజార్టీతో మరోసారి గెలవబోతున్నామని, నాలుగోసారి గెలిస్తే మరింత మంచి మంత్రి పదవి వస్తుందని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే పని చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో బీజేపీ వచ్చేది లేదు.. చచ్చేది లేదని, అలాంటి పార్టీలకు ఓటేసి వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రచారంలో మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పొన్నం అనిల్కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, ఎంఐఎం నాయకుడు గులాం అహ్మద్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ తన ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నగరంలో భారీ ర్యాలీ తీశారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్, తెలంగాణతల్లి చౌరస్తా, టవర్సర్కిల్ మీదుగా రాజీవ్చౌక్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, యువకుల నృత్యాలు కేరింతలతో ఉత్సాహంగా సాగింది.