కార్పొరేషన్, నవంబర్ 27: ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న వారిని గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని భగత్సింగ్, కోతిరాంపూర్, మారుతీనగర్, సెయింట్ జాన్స్ స్కూల్ చౌరస్తాల్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నగరంలో సాగుతున్న అభివృద్ధి కావాలో వద్దో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చేశానన్నారు. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా మెరుగుపర్చామని తెలిపారు.
సమైక్య పాలనలో నగరానికి ఎలాంటి నిధులు రాలేదన్నారు. నగరాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి పనులు చేపట్టామన్నారు. మనం ఒక్క తప్పు చేస్తే అభివృద్ధి వెనక్కిపోతుందన్నారు. ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి కొనసాగాలో లేక నిలిచిపోవాలో నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే వారికి అభివృద్ధిపై ఆలోచన ఉండని, స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే పని చేస్తారని విమర్శించారు. ప్రస్తుతం నగరంలో సాగుతున్న రోడ్లు, మానేరు రివర్ ఫ్రంట్, మెడికల్ కళాశాల, వేంకటేశ్వరాలయం, ఇస్కాన్ టెంపుల్ పనులు ముందుకు సాగవని పేర్కొన్నారు. ఈ పనులన్నింటినీ తానే పూర్తి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భూకబ్జాదారుడికి టికెట్ ఇచ్చిందన్నారు. ఎంపీ బండి సంజయ్ ఒక్క రోజు అయినా ప్రజలకు వద్దకు వచ్చారా అని ప్రశ్నించారు.? నగరాభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని అసమర్థ ఎంపీ అని విమర్శించారు.
అక్రమంగా సంపాదించిన డబ్బులతో బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నాడని విమర్శించారు. కౌన్సిలర్లకు రూ. కోటి, ఇతర ప్రజాప్రతినిధులకు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఇన్ని వేల కోట్లు బండి సంజయ్ ఏ వ్యాపారాలు చేసి సంపాదించాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఆయన రాజకీయ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. హిందువునని రెచ్చగొట్టే సంజయ్ నా కంటే పెద్ద హిందువా అని ప్రశ్నించారు.? తాను బ్రహ్మోత్సవాలు చేపట్టానని, టీటీడీ, ఇస్కాన్ ఆలయాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్కు వచ్చిన మోదీని వేంకటేశ్వర ఆలయం కోసం నిధులు కూడా అడగలేదని విమర్శించారు. కనీసం బండి సంజయ్ పోచమ్మ గుడి అయినా కట్టడా అని నిలదీశారు.
బండి సంజయ్ గెలిస్తే వారి పార్టీ అధికారంలోకి వస్తుందా?, నగరాభివృద్ధికి నిధులు తీసుకువచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. వారికి ఓటు వేస్తే రాజకీయంతో డబ్బులు సంపాదించుకుంటారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మోదీ రైతుబంధు పంపిణీ నిలిపివేశారని ఆరోపించారు. సంజయ్ తన రాజకీయ లబ్ధి కోసం యువతను పెడదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. తాను పదిహేను ఏళ్ల ఎమ్మెల్యే జీవితంలో ఎక్కడా లంచం తీసుకోకుండా బతికానని పేర్కొన్నారు. వారిని గెలిపిస్తే నగరంలో మళ్లీ గుంతలమయమైన రోడ్లు వస్తాయని హెచ్చరించారు. కేసీఆర్ను ఓడిస్తే అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ యాదగిరి సునీల్రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, బర్కత్, నర్మద, రాములు, కోల మాలతి, పద్మ, ఐలేందర్, యాదయ్య, నాయకులు నలువాల రవీందర్, ఏవీ రమణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.