కార్పొరేషన్, ఆగస్టు 28: అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత తనదని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనిమిదేళ్ల కాలంలో కరీంనగర్లో అనేక రోడ్లను సుందరంగా తీర్చిదిద్దామని, ప్రతి రోజు మంచినీటి సరఫరా అందిస్తున్నామని, పూర్తిగా రూపురేఖలు మార్చామని స్పష్టం చేశారు. కరీంనగర్లోని మాచర్ల గార్డెన్లో ఆదివారం కొత్తగా మంజూరైన 5,768 మంది 34, 35, 36, 54, 14 డివిజన్లల్లోని లబ్ధిదారులకు పింఛన్ కార్డుల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో గతంలో 20,768 పింఛన్లు ఇస్తుండగా ఇప్పుడు కొత్తగా 5,768 మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒకరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పంపించారని, అర్హులైన అందరికీ పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు. గత పాలకులు నగరంలో అభివృద్ధి కోసం నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు. కరీంనగర్ను అభివృద్ధి చేస్తే కొత్త కొత్త కంపెనీలు వచ్చి ఇకడి వారికి ఉపాధి లభిస్తుందనే ఆలోచన గత పాలకులకు రాలేదని దుయ్యబట్టారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ను కలిసి నిధులు అడిగితే ఒకే విడుతలో రూ.400 కోట్ల విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ నిధులతో నగరంలో డ్రైనేజీలు రోడ్లు నిర్మించుకున్నామని తెలిపారు. రాంనగర్ వద్ద నడిరోడ్డుపై ఉన్న టవర్ను తొలగించామని పేర్కొన్నారు. కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.600 కోట్లతో కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీతో పాటు, తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం టీటీడీ టెంపుల్ను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఎందుకు రెండు వేల పింఛన్, 24 గంటల కరెంటు అందించడం లేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రజలందరూ సీఎం కేసీఆర్కు ఆశీర్వాదం అందించాలని, అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై.సునీల్రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్లు చాడగోండ బుచ్చిరెడ్డి, మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ, అజ్జుమ్, గంట కళ్యాణి, బండారి వేణు, ఐలేందర్యాదవ్, వాల రమణారావు, తదితరులు పాల్గొన్నారు.
నాకెంతో ఆసరా అయితది
నాకు పింఛన్ ఇప్పుడు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి నెలా రెండు వేలు నాకు ఎంతో ఆసరాగా ఉంటుంది. పింఛన్ ఇచ్చిన సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలె. పేదల కోసం ఆలోచన చేస్తున్న మంచి మనిషి సీఎం కేసీఆర్. ఆయనలాంటోళ్లు ఎవరు లేరు. మరింత కాలం ఆయనే సీఎంగా ఉండాలె. దొంగల మాటాలు నమ్మేది లేదు.
– మాచర్ల లక్ష్మి