జిల్లాలో రోడ్ల పనులు వేగవంతం చేయాలి
నిధులకు కొరత లేదు
మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష
హాజరైన ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి
కార్పొరేషన్, జూన్ 30: కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేయాలని, ఇందు కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి రోడ్డు పనుల్లో వేగం పెంచి కమాన్చౌరస్తా నుంచి సదాశివపల్లి వరకు రెండు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో గురువారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ పీ రవీందర్రావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఆర్అండ్బీ పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాత రోడ్డులోని ఎలగందుల బ్రిడ్జి పనుల టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.
కరీంనగర్ నుంచి పిట్లం రహదారి పనుల్లో ప్రస్తుతం ఒద్యారం వరకు సుందరీకరణ పూర్తి చేశామని, మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తిచేయాలన్నారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, నిధుల కొరత లేదని పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జి నుంచి కమాన్ రోడ్డులో చేపట్టాల్సిన ఫ్లై ఓవర్ బ్రిడ్జికి సంబంధించి ప్రతిపాదనలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి రోడ్డు పనులు వేగంగా పూర్తి చేసి దసరా నాటికి ప్రారంభించేలా సిద్ధం చేయాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాతో పాటు మున్సిపాలిటీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు.
స్మార్ట్సిటీ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ మాట్లాడుతూ.. సైదాపూర్, బొమ్మనపల్లి, కోహెడ, వింజపల్లి రోడ్డు పనులతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆర్అండ్బీ పనులను పూర్తి చేయాలని కోరారు. అన్నారం రోడ్డును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అన్నారం, మానకొండూర్ సెంట్రల్ లైటింగ్ పనులు కూడా సత్వరమే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గన్నేరువరంలోని పనులు కూడా వేగంగా చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక రోడ్డును త్వరగా పూర్తిచేయడమే కాకుండా కనపర్తి బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. ఎస్ఈ శ్యామ్ప్రసాద్, కరీంనగర్ ఎస్ఈ ఆర్.చందర్సింగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.