రామడుగు, సెప్టెంబర్ 14: రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 1.21 కోట్లతో నిర్మించిన పలు కుల సంఘాల భవనాలు, వంతెన పనులను బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. వెలిచాలకు చేరుకున్న మంత్రులకు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్పంచ్ వీర్ల సరోజన ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమ కులస్తులు డోలు, డప్పు చప్పుళ్లతో గ్రామ పంచాయతీకి చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో మున్నూరుకాపు సంఘ భవనాన్ని ప్రారంభించారు.
తిరిగి వెలిచాలకు చేరుకొని సర్పంచ్ వీర్ల సరోజన సొంత నిధులు సుమారు రూ. 20 లక్షలతో నిర్మించిన నందనవనం (పల్లె ప్రకృతివనం) సందర్శించారు. పట్టణానికి దీటుగా పార్కును ఏర్పాటు చేసిన సర్పంచ్ను అభినందించారు. ఆర్యవైశ్య, గౌడ, కురుమ సంఘ భవనాలను ప్రారంభించారు. అనంతరం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి చేరుకోగా అర్చకుడు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా, అర్చకుడు రామానుజాచార్యులు స్వామి వారి శేషవస్త్రంతో సన్మానించారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 10 కోట్లు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కోరగా 11 కోట్లు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గంలోని రహదారులు, వంతెనల కోసం పెద్దమనసుతో రూ. 50 కోట్లు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే అడిగిన రూ. 50 కోట్లకు ప్రస్తుతం 25 కోట్లను అందించనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని 80 గ్రామ పంచాయతీలకు గానూ ప్రస్తుతం 50 భవనాల నిర్మాణానికి రేపే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సర్పంచ్ వీర్ల సరోజన అందించిన వినతిపత్రంపై స్పందించి వెలిచాల గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. వెలిచాలలో గ్రామస్తుంతా ఏకమై ఆలయాలను బాగు చేసుకొని, కుల సంఘ భవనాలు నిర్మించుకోవడం అభినందనీయమని కొనియాడారు. వెలిచాలలో అంబేద్కర్, కురుమ, మున్నూరుకాపు (గుడ్డేలుగులపల్లి), పద్మశాలీ (కిష్టారావుపల్లి), ఆర్యవైశ్య, గౌడ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలీ (వెలిచాల), మైనార్టీ సంఘ భవనాలు, చిన్న చెరువు మత్తడి వద్ద వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, సర్పంచ్ వీర్ల సరోజన-ప్రభాకర్రావు, ఎంపీటీసీ వీర్ల వసంత, ఎంపీపీ కలిగేటి కవిత, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, సింగిల్విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వరరావు, వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఆర్ఐ రజినీ, ఎంపీవో సురేందర్, ఏపీవో రాధ, ఏపీఎం ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.