Collector Koya Sri Harsha | పెద్దపల్లి/జూలపల్లి, మార్చి2: జూలపల్లి మండలం కాచాపూర్ ప్రభుత్వ పాఠశాల స్ఫూర్తితో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. మధ్యాహ్నం భోజనం అందించడంలో రాష్ర్టస్థాయి పురస్కారం పొందిన కాచాపూర్ పాఠశాల సిబ్బందిని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వహణలో రాష్ర్ట వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశీలనలో 3 పాఠశాలలకు రాష్ర్ట స్థాయిలో పురస్కారాలు వచ్చినట్లు తెలిపారు. కాగా అందులో పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఒక్కటని వెల్లడించారు. అనంతరం అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ పీఎం షేక్, జూలపల్లి మండల విద్యాధికారి సరస్వతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయులు రాజేందర్ రెడ్డి లను జిల్లా కలెక్టర్ సన్మానించారు.