మనసుంటే మార్గం ఉంటుంది.. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.. ఆ కోవలోనే మెట్పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్ అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. తన సృజన్మాత్మకతతో ప్రజలకు ఉపయోగపడే పరికరాలు రూపొందించిన ఆయన, తాజాగా తాగిపడేసే కొబ్బరి బొండాలను చిదిమేసి ఎరువుగా మార్చే కొకోనట్ ష్రెడ్డింగ్ మిషన్ (కొబ్బరి బొండాల క్రషింగ్ యంత్రం)ను ఆవిష్కరించారు. టెంకలతో కొకోపీట్, పీచుతో కొకొ ఫైబర్ను తీసేలా యంత్రాన్ని కనిపెట్టి ఔరా అనిపించారు. ఇటీవల జగిత్యాల ఖిలాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాన మిషన్ను ప్రదర్శించి మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి ప్రశంసలు అందుకోడమేకాదు ఉత్తమ ఆవిష్కర్త పురస్కారాన్ని దక్కించుకున్నారు.
మెట్పల్లి, సెప్టెంబర్ 2 : అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ అనర్హం అన్నట్లు తాగి పడేసిన కొబ్బరి బొండాలతో సైతం బహుళ ప్రయోజనాలు ఉన్నాయని నిరూపిస్తున్నారు మెట్పల్లి పట్టణానికి అల్లాడి ప్రభాకర్. తన సృజనాత్మకతతో కొకోనట్ ష్రెడ్డింగ్ మిషన్ (కొబ్బరి బొండాల క్రషింగ్ యంత్రం)ను ఆవిష్కరించారు. పట్టణంలో ప్రభాత్ ఇండస్ట్రీస్ నడుపుతున్న ప్రభాకర్ ఇప్పటికే అనేక ఆవిష్కరణలు చేశారు. మల్టీపర్పస్ బెడ్, విద్యుత్ స్తంభాలను సులువుగా ఎక్కే క్లిప్పులు, ఆటోమెటిక్ జనరేటర్, సైరన్, 500 మీటర్ల్ల దూరం వెలుగునిచ్చే టార్చిలైట్, డ్రైనేజీలో ఇంకుడు గుంతలు, సోలార్తో ఆటో ట్రాలీ, రెండు పంకలతో కూడిన కూలర్ వంటి అనేక ఆవిష్కరణలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా కొకొనట్ ష్రెడ్డింగ్ మిషన్ను సరికొత్తగా ఆవిష్కరించారు.
ఎండు కొబ్బరి చిప్పల గ్రైండింగ్తో వచ్చే పొడిని కొకోపీట్ అంటారు. దీనిని పంటలకు ఎరువుగా వాడవచ్చు. పంట పొలాలు, నర్సరీలు, గార్డెన్స్, అదే విధంగా ఇండ్లలో పెంచుకునే గార్డెన్స్ ఇతరత్రా పూలు తదితర మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. దీని వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ రోజులు ఉంటుంది. ఫలితంగా పంటలకు ఒక్కోసారి సకాలంలో నీరు అందకపోయినా ఎండిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. తేమ తొందరగా ఆవిరికాకపోవడం వల్ల కొంత వరకు పంట సంరక్షణకు తోడ్పడుతుంది. పంటలు, ఇతరత్రా మొక్కలకు ఎంతో మేలు చేకూరుతుంది.
ఇది వాణిజ్య పరంగా ఎంతో లాభసాటిగా ఉపయోగపడుతుంది . కొబ్బరి పీచు ద్వారా కొబ్బరి తాళ్లు, విగ్రహాలు, కుర్చీలు, సోఫాలు, పాల్ సీలింగ్ వంటి తయారీలో వినియోగించవచ్చు.
వ్యర్థాల నుంచి ఉత్పత్తులు
మనిషికి ఆరోగ్యరీత్యా కొబ్బరి బొండాల నీరు తాగడం మంచిది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా కొబ్బరి నీళ్లు తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లోనూ వీటి క్రయ, విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన కూడళ్లలో తాగిపడేసిన కొబ్బరి బొండాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అయితే వీటిని సేకరించి డంప్ యార్డుకు తరలించడంలో అటు పట్టణాల్లో మున్సిపాలిటీ సిబ్బంది, ఇటు గ్రామాల్లో పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి పెద్ద సమస్యే అవుతుంది. ఈ క్రమంలో ప్రభాకర్ ఈ సరికొత్త మిషన్ను ఆవిష్కరించారు. ఒక గంటలో 200 వ్యర్థ కొబ్బరి బొండాలను గ్రైడింగ్ చేసేలా రూపొందించి పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ప్రభాకర్ ఈ మిషన్ను ప్రదర్శించి ఉత్తమ ఇన్నోవేటర్గా మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. కాగా, ఈ యంత్రం ద్వారా వ్యర్థ కొబ్బరి బొండాల నుంచి రెండు రకాల ఉత్పత్తులు కొకోపీట్, కొకో ఫైబర్ను తయారు చేయవచ్చు.
ఇలా పనిచేస్తుంది..
కొకొనట్ ష్రెడ్డింగ్ మిషన్ను పట్టణాలతోపాటు మారుమూల గ్రామాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యంత్రానికి సింగిల్ ఫేజ్ విద్యుత్, 3హెచ్పీ మోటర్ సరిపోతుంది. ఇది గంటకు సుమారు 200 వ్యర్థ కొబ్బరి బొండాలను క్రష్ (గ్రైండింగ్) చేస్తుంది. ఈ మిషన్ ద్వారా నెలకొల్పి కొకొపీట్, కొకో ఫైబర్ విక్రయాల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.