పెద్దపల్లి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాధనే లక్ష్యంగా గులాబీ జెండాను ఎత్తి ఉద్యమించి లక్ష్యాన్ని ఏ విధంగా ముద్దాడామో.. అదే పంథాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేదాకా నిదురపోవద్దని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. మనం అలసత్వం వహిస్తే అవాస్తవాలు, అబద్దాలు రాజ్యమేలుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం సెగ్మెంట్లోని 259పోలింగ్ బూత్ కమిటీల బీఆర్ఎస్ కన్వీనర్, కో-కన్వీనర్, ఇన్చార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన అటువంటి దరిద్రపు పాలన చరిత్రలో లేదని, ప్రజావ్యతిరేక విధానాలతో కంట కన్నీరు తెప్పిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గత పదేండ్ల కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ పాలనలపై చర్చపెట్టి ఆ పార్టీ కార్యకర్తలను చెడుగుడు ఆడించాలని పిలుపునిచ్చారు.
రామగుండం సెగ్మెంట్లో 259 పోలింగ్ బూతుల్లో బూత్ ఇన్చార్జిలను నియమించుకొని బూత్ కమిటీలను నిర్మించుకోవడం శుభ సూచకమన్నారు. ఇదే విధానాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామన్నారు. బూత్ కమిటీలు ఇప్పటి నుంచే తమ పనిని ప్రారంభించాలని, ఎన్నికలకు ఇంకా ఆరునెలల సమయం మాత్రమే ఉందన్నారు. పోలింగ్ బూతు ల పరిధిలో ప్రభావం కలిగిన వ్యక్తులు ఉంటారని, అలాంటి వారిని గౌరవించి పార్టీ కోసం పనిచేసేలా ముందుకు నడపాలన్నారు. అంతిమంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మేయర్ బంగి అనీల్కుమార్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయారెడ్డి, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ పాల్గొన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రామస్వామి ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కుట్రలను తిప్పి కొట్టాలి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరేయాలి. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఛేధించి విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలి. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రామగుండంలోని ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక బూత్ కమిటీ కన్వీనర్, కో-కన్వీనర్, ఇన్చార్జిలు మొత్తం 259 మందిని నియమించాం. వారంతా తమ పరిధిలోని వెయ్యి మంది ఓటర్లను వంద మందికి ఒక టీంగా తయారు చేయాలి. ఆయా టీంలకు ఉత్సాహవంతులైన బీఆర్ఎస్ సైనికులను నియమించుకోవాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని కళ్ల ముందుంచాలి. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి మా దృష్టికి తీసుకురావాలి. సంస్థాగత నిర్మాణం తొలుత రామగుండం నుంచే మొదలైంది. రాబోయే రోజుల్లో జిల్లాలోని మిగతా పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోనూ నిర్మించుకుంటాం.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు/ రామగుండం ఎమ్మెల్యే
అసత్య ప్రచారాన్ని అడ్డుకోవాలి
నేటి సమాజంలో బీజేపీ, కాంగ్రెస్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. పూర్తిగా అసత్య ప్రచారాన్నే నమ్ముకొని పనిచేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ఎక్కడో పదెకరాలు మునిగితే దానిని బూతద్ధంలో చూపుతూ ప్రచారం చేస్తున్నారు. మరి అదే ప్రాజెక్టుతో పారిన వేల ఎకరాల గురించి ప్రజలకు చెప్పేదెవరు? అది మనమే చేయాలి. దేశంలోని సంపదనంతా బీజేపీ కొద్ది మందికి దోచిపెడుతున్నది. ఆ చర్చను కూడా జరగనివ్వడం లేదు. ఆలయాల్లో పూజారులు, మసీదుల్లో ఇమామ్లు, చర్చిల్లో పాస్టర్లకు దేశంలో ఏ ప్రభుత్వమైనా గౌరవించి జీతాలు ఇస్తున్నదా..? చెప్పాలి. ఎక్కడా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది. దీనిమీదా చర్చ జరగాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జిల్లాకో మెడికల్ కళాశాలను ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా.. ఇక్కడ ఇచ్చింది.. దీనిపైనా చర్చించాలి.. ఒకడేమో చీరుతాం, పొడుస్తాం, గుద్దుతాం అంటున్నడు. మరొకడు నక్సలైట్లు వెళ్లి ప్రగతి భవన్ని కూల్చాలి అంటడు. వాళ్లేమో కాల్పుల్లో చావాలి. కేసుల్లో జైళ్లకు పోవాలి. వీడేమో సీఎం కావాలా..? ఇదేం విమర్శలు, ఇవేం ప్రచారాలు వీటన్నింటిపై ప్రతి ఇంటిలో చర్చ జరిగేలా ప్రతి బూత్ కమిటీ కన్వీనర్ పనిచేయాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. వాటన్నింటినీ ప్రజల్లోకి వెళ్లి వివరించాలి.
– మల్లోజుల విజయానంద్, తెలంగాణ వికాస సమితి కన్వీనర్
అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ వివరించాలి
ఎన్నికలు రాగానే ఎవరూ ఆగమాగం కావద్దు. బీఆర్ఎస్ చేపట్టిన విజయాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమంపైనే చర్చించాలి. పార్టీలో అనవసర విషయాలపై ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృథా చేయవద్దు. మన కోసం పార్టీ చేసిన, రామగుండం ఎమ్మెల్యే చందర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే చారిత్రాత్మక అభివృద్ధి జరుగుతున్నది. రామగుండంలో మెడికల్ కాలేజీ ఎక్కడ? అని చాలా మంది ఆందోళనలు చేశారు. ప్రెస్మీట్లు పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడిన వారు ఇపుడు తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నది. ఈ విషయాలన్నింటిపైనా కార్యకర్తలు ప్రజలకు సమగ్రంగా వివరించాలి.
– పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్ (పెద్దపల్లి)