విద్యానగర్, జనవరి 7: అరుదైన ఆపరేషన్లకు కేరాఫ్గా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా దవాఖాన వైద్య బృందం మరో ఘనత సాధించింది. కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు పేషెంట్లకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన చరణ్, ప్రసన్న అనే యువకులు తీవ్రమైన కడుపునొప్పితో మూడు రోజుల కిందట కరీంనగర్ దవాఖానలో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు అపెండిసైటిస్గా నిర్ధారించి ఆపరేషన్ అవసరమని చెప్పారు.
వారి కుటుంబసభ్యుల అంగీకారం మేరకు ఆదివారం జనరల్ సర్జరీ విభాగం హెచ్వోడీ, ప్రొఫెసర్ డాక్టర్ టీ శాలిని ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేందర్, డాక్టర్ హరికృష్ణారెడ్డి, డాక్టర్ ప్రణయ్ కుమార్, సీనియర్ డాక్టర్ మిలాన్ సమక్షంలో లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఆపరేషన్ చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు అయ్యే ఆపరేషన్ను ఉచితంగా చేయడంపై పేషెంట్ల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య బృందాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి అభినందించారు.